నాడు హిట్లర్ – నేడు గాడ్ ఫాదర్

మెగాభిమానులకు ఆచార్య గాయం మాసిపోయేలా గాడ్ ఫాదర్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మోహన్ రాజా ఆనందం మాములుగా లేదు. ఇరవై ఏళ్ళ తర్వాత దర్శకుడిగా టాలీవుడ్ కి ఇచ్చిన రీ ఎంట్రీ అదిరిపోవడంతో తన సంతోషం ఏ స్థాయిలో ఉందో నిన్న మీడియాని కలిసినప్పుడు ఆయన మొహంలో గమనించవచ్చు. ముఖ్యంగా లూసిఫర్ రీమేక్ ని ఎలా డీల్ చేసి ఉంటారానే అనుమానాలను బద్దలు కొట్టడంతో పాటు కీలకమైన మార్పులు చేయడం వల్ల ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ ని పోగొట్టారేమోననే డౌట్లను కూడా పూర్తిగా తీసేశారు. మొదటి రోజు 38 కోట్ల దాకా రాబట్టడం మంచి ఫిగరే.

ఇక్కడో సంగతిని గుర్తు చేసుకోవాలి. మోహన్ రాజా తండ్రి గారు ఎడిటర్ మోహన్ 1995లో చిరంజీవి వరస డిజాస్టర్లతో ఉన్నప్పుడు మలయాళం హిట్లర్ రీమేక్ ప్రతిపాదనని తీసుకెళ్లారు. విపరీతమైన సిస్టర్ సెంటిమెంట్ తో ఉన్న ఆ సబ్జెక్టుని చేయాలా వద్దా అని ఎంతో మధనపడిన తర్వాత ఫైనల్ గా కంటెంట్ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చిరు. కట్ చేస్తే ఏడాదికి పైగా తీసుకున్న గ్యాప్ కి పూర్తి న్యాయం చేకూరుస్తూ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ అయ్యింది. కన్నీళ్లతోనూ కాసులు కురిపించింది. అక్కడితో మొదలు చిరంజీవి మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఎప్పుడూ పడలేదు.

ఇప్పుడు గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ సమయంలోనూ ఏమంత బజ్ లేదు. ఆచార్యతో చిరు పనైపోయిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న టైంలో సరైన కథతో తనను చూపిస్తే వసూళ్లు ఎంత గట్టిగా ఉంటాయో బాక్సాఫీస్ సాక్షిగా ఋజువవుతోంది. ఆనాడు తండ్రి సూపర్ హిట్ ఇస్తే ఇప్పుడు కొడుకు అంతకు మించిన సక్సెస్ ఇచ్చి మెగా ఫ్యామిలీతో ఒకరకమైన స్పెషల్ బాండింగ్ ని ఏర్పరుచుకున్నారు. ఏ స్థాయికి వెళ్తుంది, ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చెప్పలేం కానీ నెక్స్ట్ రాబోయే వాల్తేర్ వీరయ్య, బోళా శంకర్ బిజినెస్ లకు కావాల్సిన బూస్ట్ అయితే గాడ్ ఫాదర్ పుష్కలంగా ఇచ్చేశాడు.