బాలు అభిమానుల గుండెకోత


ఆంధ్రప్రదేశ్‌లో కనీసం వారానికి ఒక్కటైనా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం అయ్యే వివాదం లేకపోతే అక్కడి ప్రభుత్వానికి నిద్ర పట్టదా అన్న సందేహాలు కలుగుతుంటాయి అక్కడి పరిణామాలు చూస్తుంటే. అవసరం లేని విషయాల్లో వేలు పెట్టి వివాదం రాజేయడం, అప్రతిష్టను కొని తెచ్చుకోవడం జగన్ సర్కారుకు ఆనవాయితీగా మారిపోయింది ఈ మధ్య.

విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇదంతా డీవియేషన్ పాలిటిక్స్ అన్న డిస్కషన్ జరిగింది కానీ.. అంతిమంగా ఈ పరిణామం జగన్ సర్కారుకు డ్యామేజ్ చేసేదే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తీరు అలా ఉండగా.. తాము ఏం తక్కువ తిన్నాం అన్నట్లుగా జిల్లా స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు కూడా ఇదే బాటను అనుసరిస్తున్నాయి.

గుంటూరు పురపాలిక సంఘం అధికారులు తాజాగా ఒక అనవసర వివాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టారు. ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అవమానకర రీతిలో తొలగించడం వివాదాస్పదం అయింది. అసలే తెలుగు వారు బాలును ఎప్పుడూ సరైన రీతిలో గౌరవించలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన మరణించినపుడు, తదనంతరం తమిళులు బాలుకు ఇచ్చిన నివాళి, ఆయన్ని గౌరవించిన తీరు ముందు మనవాళ్ల స్పందన వెలవెలబోయింది.

ఐతే గుంటూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొంతలో కొంత ఆయన్ని గౌరవించారు. ఐతే ఈ విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైందంటూ దాన్ని తొలగించేశారు అధికారులు. బాలు అభిమానులు ఎంత వారించినా వినకుండా జేసీబీతో విగ్రహాన్ని పెకలించి.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక మరుగుదొడ్డి సమీపంలో పెట్టడం గమనార్హం. సంబంధిత ఫొటోలు, వీడియోలు బాలు అభిమానులకు గుండెకోతను మిగులుస్తున్నాయి. గుంటూరు సిటీలో దాదాపు 200 విగ్రహాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైనట్లు అక్కడి వారు చెబుతున్నారు. ఇందులో చాలా వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలే అంటున్నారు. వాటికి లేని నిబంధనల అతిక్రమణ బాలు విగ్రహం విషయంలోనే వచ్చిందా.. అంత గొప్ప గాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అభిమానులు తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా బాలు అభిమానుల నుంచి జగన్ సర్కారు వ్యతిరేకత ఎదుర్కొనేలా కనిపిస్తోంది.