హాలిడే వసూళ్లకు మ్యాచ్ దెబ్బ

సీజన్ ఏదైనా సినిమాలకు వీకెండ్ కలెక్షన్లు చాలా కీలకం. ముఖ్యంగా యావరేజ్ టాక్ వచ్చినవి అంతో ఇంతో గట్టేక్కేది ఈ టైంలోనే. అయితే ఆదివారం రెవిన్యూకు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పెద్ద దెబ్బే వేయనుంది. మొదటి రెండు ఆటల్లో చెరొకటి గెలవడం వల్ల హైదరాబాద్ లో జరిగేది ఫైనల్ తరహాలో సిరీస్ విన్నర్ తేల్చేది కావడంతో క్రికెట్ అభిమానుల ఉత్సాహం మాములుగా లేదు. రెండు రోజుల క్రితం కేవలం టికెట్లు కొనేందుకే స్టేడియం వద్ద ఫ్యాన్స్ కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడం, పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం లాంటి సంఘటనలు న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం.

అక్కడే ఇలా ఉంటే ఇక టీవీలో ఓటిటిలో ఎన్ని కోట్ల మంది చూస్తారో వేరే చెప్పాలా. మొన్న రెండో ట్వంటీ ట్వంటీలో రోహిత్ శర్మ బాదుతున్న టైంలో హాట్ స్టార్ వ్యూయర్ షిప్ ఏకంగా కోటికి టచ్ చేయడం బట్టే చెప్పొచ్చు జనాల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో. ఇప్పుడిది నేరుగా కీలకమైన ఈవెనింగ్ షోల మీద దెబ్బ కొడుతుంది. ఎందుకంటే మ్యాచ్ మొదలయ్యేది ఏడు గంటల తర్వాత. ముగిసేలోపు పదకొండు దాటేస్తుంది. అంటే ఫస్ట్ షో సెకండ్ షో రెండింట్లో ఏదో ఒకటి చూసే ఛాన్స్ కూడా ఉండదు. శుభ్రంగా ఇంట్లో అతుక్కుపోవడం తప్ప.

మొన్న విడుదలైన కృష్ణ వృంద విహారికి పర్లేదనే మాట వినిపిస్తోంది కానీ దాని ఆశలన్నీ సండే మీదే ఉండేవి. ఎందుకంటే రాబోయే వారం పొన్నియన్ సెల్వన్ 1, నేనే వస్తున్నా, విక్రమ్ వేదాలు ఉన్నాయి కాబట్టి ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలి. అల్లూరి సైతం హాలిడేని క్యాష్ చేసుకుందామని చూస్తే ఇప్పుడీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అవతార్ రీరిలీజ్ ది కూడా ఇదే సమస్య. ఒకవేళ ఆసీస్ రెండో మ్యాచ్ కూడా గెలిచి ఉంటే ఇప్పుడున్న ఆసక్తి తగ్గిపోయేది. కానీ జరిగింది వేరు. మొత్తానికి ఇలాంటి టి20 సిరీస్ లు ఉన్నప్పుడు బాక్సాఫీస్ ప్రతిసారి ప్రభావితం చెందుతూనే ఉంది.