దిల్ రాజు మ్యాజిక్‌నే న‌మ్ముకున్నారు

బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి బ‌డ్జెట్లో, అలాంటి భారీ తారాగ‌ణంతో, దానికి ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్. త‌మిళ ఫిలిం ఇండ‌స్ట్రీ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌గా భావిస్తోంది. అక్క‌డి ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమా విష‌యంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వాళ్ల చ‌రిత్ర‌తో ముడిప‌డ్డ క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా కావ‌డం, అక్క‌డి పేరుమోసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు సినిమాకు ప‌ని చేయ‌డం.. ఇలా వాళ్లు అంతగా ఎగ్జైట్ కావ‌డానికి చాలా కార‌ణాలున్నాయి.

కానీ బాహుబ‌లి ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించిన‌ట్లు.. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌మిళ‌నాడు అవ‌త‌ల పెద్ద‌గా బ‌జ్ క్రియేట్ చేయ‌లేక‌పోతోంది. ఈ సినిమాకు సంబంధించి హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రెండు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లు జ‌రిగాయి.

అయినా స‌రే.. అనుకున్న స్థాయిలో పొన్నియ‌న్ సెల్వ‌న్ బ‌జ్ తీసుకురాలేక‌పోయింది. రెండో ప్రెస్ మీట్ గురించి మీడియాలో కూడా పెద్ద‌గా హ‌డావుడి లేదు. చిత్ర బృందం నుంచి విక్ర‌మ్, త్రిష‌, కార్తి లాంటి వాళ్లు హైద‌రాబాద్ వ‌స్తుంటే దాని గురించి ముందే సోష‌ల్ మీడియాలో కొంచెం హ‌డావుడి చేయాల్సింది. అలా జ‌ర‌గ‌లేదు. వాళ్లు వ‌చ్చి వెళ్లాక కూడా మీడియాలో సినిమా గురించి పెద్దగా చ‌ర్చ లేదు.

ఐతే ఇప్ప‌టిదాకా ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెట్టేస్తే.. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకో వారం మాత్ర‌మే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. సినిమా నుంచి ఎగ్జైటింగ్ కంటెంట్ తీసుకుని దాన్ని జ‌నంలోకి తీసుకెళ్లి సినిమా ప‌ట్ల ఆస‌క్తిని పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది దిల్ రాజు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌బ్లిసిటీ విష‌యంలో త‌గ్గే ర‌కం కాదు. రిలీజ్ వీక్‌లో ఆయ‌న సొంత సినిమాల‌కు చేసిన‌ట్లు గ‌ట్టిగా పబ్లిసిటీ చేసి రిలీజ్ రోజుకు తేవాల్సిన హైప్ తెస్తారని మ‌ణిర‌త్నం అండ్ కో ఆశ‌లు పెట్టుకున్నట్లుంది.