మా సినిమా ఫ్రీమేక్ కాదు.. రీమేక్

దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌.. ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మూడు కొత్త చిత్రాల్లో ఒక‌టి. కీర‌వాణి చిన్న కొడుకు సింహా కోడూరి క‌థానాయ‌కుడిగా స‌తీష్ త్రిపుర అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన చిత్ర‌మిది. తెలుగులో వ‌స్తున్న తొలి స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. అనుకోకుండా ఒక కారులో ఇరుక్కుపోయిన కుర్రాడు.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డటానికి చేసే ప్ర‌య‌త్నం నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది.

ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన అంద‌రికీ 44 అనే హాలీవుడ్ మూవీ గుర్తుకొచ్చింది. చిత్ర బృందం ఆ సినిమాను ఫ్రీమేక్ చేసేసిందంటూ కౌంట‌ర్లు వేశారు సోష‌ల్ మీడియాలో. ఐతే త‌మ సినిమా అలా కాపీ కొట్టి తీసింది కాద‌ని హీరో సింహా వెల్ల‌డించాడు. 44 సినిమా రీమేక్ హ‌క్కులు అధికారికంగా తీసుకునే దొంగ‌లున్నారు జాగ్ర‌త్త చిత్రాన్ని రూపొందించిన‌ట్లు అత‌ను ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపాడు.

ఐతే ఒరిజిన‌ల్‌ను యాజిటీజ్‌గా తాము ఫాలో అయిపోలేద‌ని సింహా చెప్పాడు. బేసిక్ ఐడియా తీసుకుని, దాన్ని మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు అడాప్ట్ చేసుకున్న‌ట్లు తెలిపాడు. మాతృక‌తో పోలిస్తే ఇందులో వేరే పాత్ర‌లు, స‌న్నివేశాలు ఉంటాయ‌ని.. ఒక ఎమోష‌న‌ల్ యాంగిల్ కూడా జోడించామ‌ని.. హీరో బ్యాక్ స్టోరీ, అలాగే క్లైమాక్స్ కొన్ని సీన్లు అద‌నంగా ఉంటాయ‌ని సింహా చెప్పాడు. గంట‌న్న‌ర నిడివి మాత్ర‌మే ఉండే సినిమాలో ప్ర‌తి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంద‌ని.. ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తుంద‌ని అత‌న‌న్నాడు.

ఇక త‌న కెరీర్ గురించి మాట్లాడుతూ త‌మ కుటుంబంలో భారీ సినిమాలు చేసే పెద్ద పెద్ద వ్య‌క్తులు ఉన్న‌ప్ప‌టికీ.. సొంతంగా ప్ర‌తిభ చాటుకోవాల‌నే ఉద్దేశంతో త‌న అభిరుచి మేర‌కు చిన్న సినిమాలు చేస్తున్నానని.. వీటితో త‌నేంటో రుజువు చేసుకున్నాక పెద్ద సినిమాలు చేస్తాన‌ని.. నేరుగా పెద్ద సినిమాలు చేస్తే తాను ఇప్ప‌టికి ఇండ‌స్ట్రీలో ఉండేవాణ్ని కాద‌ని.. ఒక్క సినిమాతోనే ప‌నైపోయేద‌ని సింహా వ్యాఖ్యానించ‌డం విశేషం.