నాగ్ 100.. రేసులో న‌లుగురు

టాలీవుడ్లో మ‌రో స్టార్ హీరో వంద సినిమాల మైలురాయికి చేరువ అవుతున్నాడు. ఆయ‌నే అక్కినేని నాగార్జున‌. ఆయ‌న వందో సినిమా గురించి కొన్నేళ్ల నుంచి చ‌ర్చ జ‌రుగుతోంది. అభిమానులు ఈ మైలురాయి విష‌యంలో చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. నాగ్ కూడా ఆ చిత్రం మీద ప్ర‌త్యేకంగానే దృష్టిసారించిన‌ట్లున్నాడు. త‌న‌కు ఆ సినిమా చాలా స్పెష‌ల్ అని, కాబ‌ట్టి దాని కోసం గ‌ట్టిగానే క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని నాగ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

ఈ సినిమా కోసం ఎవ‌రో ఒక‌రితో అని కాకుండా నలుగురు ద‌ర్శ‌కుల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్లు నాగ్ స్వ‌యంగా తెలిపాడు. వందో సినిమా అంటే ఒక స్థాయిలో ఉండాల‌ని, అందుకు త‌గ్గ క‌థ కోసం చూస్తున్నాన‌ని.. స‌రైన క‌థ దొర‌గ్గానే ఈ ప్రాజెక్టు గురించి వెల్ల‌డిస్తాన‌ని, ద‌ర్శ‌కుడెవ‌రో చెబుతాన‌ని నాగ్ తెలిపాడు.

ప్ర‌స్తుతానికి నాగ్ వందో సినిమాకు రేసులో ముందున్న ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజానే అని తెలుస్తోంది. తెలుగువాడే అయిన ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడే మోహ‌న్ రాజా. అత‌ను ఇప్ప‌టికే తెలుగులో హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు చిరు సినిమా గాడ్ ఫాద‌ర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. మోహ‌న్ రాజా కెరీర్లో చాలా వ‌ర‌కు రీమేక్‌లే ఉన్నాయి. హ‌నుమాన్ జంక్ష‌న్ ఓ మ‌ల‌యాళ హిట్ ఆధారంగా తెర‌కెక్క‌గా.. తెలుగులో విజ‌య‌వంతం అయిన జ‌యం, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వ‌ర్షం, ఆజాద్.. ఇలా చాలా సినిమాలే రీమేక్ చేశాడ‌త‌ను.

ఐతే త‌న సొంత క‌థ‌తో త‌న త‌మ్ముడు హీరోగా అత‌ను తీసిన‌ త‌నీ ఒరువ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి అత‌డి పేరు మార్మోగేలా చేసింది. ఆ త‌ర్వాత త‌న క‌థ‌తోనే వేలైక్కార‌న్‌తో మ‌రో హిట్ కొట్టాడు. ఇప్పుడు గాడ్ ఫాద‌ర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ్ కోసం అత‌ను ఒక స్పెష‌ల్ స్టోరీ రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం.