హిట్టు కోసం కుర్ర హీరో పాదయాత్ర

పాద యాత్ర ఈ పదం పొలిటికల్ లో బాగా వినిపిస్తుంటుంది. ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లీడర్స్ చేసే కాలి నడక యాత్రను పాద యాత్ర అంటారు. చాలా మంది రాజకీయ నాయకులు పాద యాత్ర చేసి సక్సెస్ అయ్యారు. మంచి వోట్ బ్యాంక్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాద యాత్రతో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ హిట్టు కొట్టడానికి కుర్ర హీరో నాగ శౌర్య టూర్లు మొదలు పెట్టాడు.

నాగ శౌర్య నటించిన ‘కృష్ణ వ్రిందా విహారి’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రీవియస్ ఫ్లాప్స్ అన్నీ మర్చిపోయేలా ఓ సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శౌర్య. అందుకే ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆడియన్స్ లోకి సినిమాను తీసుకెళ్లేందుకు ఓ పాద యాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం ఓ రూట్ సెలెక్ట్ చేసుకున్నాడు. తిరుపతి నుండి మొదలు పెట్టి నెల్లూరు , ఒంగోలు , విజయవాడ , గుంటూరు , ఏలూరు , భీమవరం , రాజమండ్రి , కాకినాడ మీదుగా వైజాగ్ తో శౌర్య పాద యాత్ర ముగియనుంది.

అయితే శౌర్య తిరుపతి నుండి వైజాగ్ వరకూ కాలి నడక యాత్ర చేయడు. ప్రతీ ఊరిలో కొంత దూరం మాత్రమే ప్రేక్షకులతో కలిసి నడుస్తూ వారికి ఫోటోలు ఇస్తుంటాడు. ఏదేమైనా రాజకీయంలో చూసే పాద యాత్ర శౌర్య ఇప్పుడు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఒక వేళ ఈ యాత్ర సక్సెస్ అయి శౌర్య కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తే మిగతా యంగ్ హీరోలు రిలీజ్ కి ముందు ఇలా పాద యాత్రలంటూ సరికొత్త ప్రమోషన్ ని ఫాలో అవ్వడం ఖాయం.