చోళ రాజ్యంలో ఆధిపత్య పోరు

గత కొన్నేళ్లుగా తన స్థాయి మేజిక్ కోల్పోయిన లెజెండరీ దర్శకులు మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మీద కోలీవుడ్ లో మాములు అంచనాలు లేవు. మనకు బాహుబలి ఎలాగో తమిళులకు ఇదీ ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందన్న నమ్మకం అక్కడి ప్రేక్షకుల్లో ఉంది. ప్రమోషన్లు కూడా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. ట్రైలర్ లాంచ్ కి సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ లను ఒకేవేదిక మీదకు తీసుకొచ్చి అంగరంగ వైభవంగా విడుదల చేశారు. చాలా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎన్నో ఏళ్ళ తర్వాత సౌత్ ఈవెంట్ కు ఐశ్వర్య రాజ్ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ.

సాధారణంగా తన శైలికి భిన్నంగా ఈసారి మణిరత్నం విజువల్ గ్రాండియర్ ని ఎంచుకున్నారు. చోళ రాజ్యంలో ఒకరిని బలికోరిన తోకచుక్క ఒకటి పచ్చటి నేల మీద చిచ్చు రేపుతుంది. రాజకుటుంబంలో ముసలం పుడుతుంది. రక్షణకై ఒకరు ఆధిపత్యం కోసం మరొకరు యుద్దాలు చేసుకోవడం మొదలుపెడతారు. ఆడవాళ్ళూ ఇందులో భాగమవుతారు. ఆత్మీయతలు అరాచకాలు రెండూ ఉంటాయి. చివరికి ఈ కథ ఏ మజిలీకి చేరుకుందనేది పిఎస్ 1ని తెరమీద చూసి తెలుసుకోవాలి. రానా వాయిస్ ఓవర్ లో చూచాయగా కథను చెప్పించారు.

విఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ దేనికవే చాలా ఉన్నతంగా పోటీ పడ్డాయి. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ స్టన్నింగ్ గ్రాఫిక్స్ తో నింపేసిన మణిరత్నం ఆయనే చెప్పినట్టు రాజమౌళి స్థాయిలో ఎమోషన్స్ ని, గూస్ బంప్స్ హీరోయిజంని పండించారా లేదానేదే దీని ఫలితాన్ని శాశించనుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ ఛాయాగ్రహణం టాప్ నాచ్ అనే చెప్పాలి. ఆరవ వాసన గుప్పుమంటున్న పొన్నియన్ సెల్వన్ కు తెలుగులో మాత్రం పిఎస్ 1 అని టైటిల్ పెట్టడం కొసమెరుపు.