అందుకే ఎగిరెగిరిపడొద్దు..

ఇండస్ట్రీలో భిన్నంగా ఉన్నది ఉన్నట్లు చెబుతూ.. ఎవరేం అనుకున్నా ఫర్లేదన్నట్లుగా మాట్లాడే ధైర్యం.. దమ్ము ఉన్న అతి కొద్దిమందిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అగ్ర నిర్మాతగా పేరున్నా.. ఆయన సినిమాలు తీయటం తగ్గింది. అయినప్పటికీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇష్యూల మీద ఆయన రియాక్టు అయ్యే తీరు సూటిగా ఉంటుంది. భారీ డిజాస్టర్ గా నిలిచిన లైగర్ మీద ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయన్న ఆయన.. మన యాక్షన్ మీదనే ప్రేక్షకుల రియాక్షన్ ఆధారపడి ఉంటుంది.. అని వ్యాఖ్యానించారు.

సినిమానే కాదు.. ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దన్న హితవు పలికారు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. మేం ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించాం. మా సినిమాను చూడండి అంటూ ఏ యూనిట్ అయినా తమ సినిమాను ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది.. అంటూ సమస్యకు సొల్యూషన్ ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు.

లైగర్ ప్రమోషన్ సందర్భంగా.. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు.. బాయ్ కాట్ సందర్భంగా అతగాడు స్పందించిన తీరు తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన తమ్మారెడ్డి.. నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు.. అని పేర్కొన్నారు. లైగర్ పరాజయానికి కారణాలు ఏమై ఉంటాయన్న ప్రశ్నకు తమ్మారెడ్డి ఆచితూచి అన్నట్లు రియాక్టు అయ్యారు. తానీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడనని.. తాను పూరీ అభిమానిగా పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే తనకెంతో ఇష్టమని.. లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమాను చూడాలనిపించలేదన్నారు. ఒక వేళ ఫ్యూచర్ లో సినిమాను చూడాలనిపిస్తే చూస్తా. సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిపోతున్న కొద్దీ బాయ్ కాట్ తరహా ట్రెండ్స్ వస్తుంటాయి. అలాంటి ట్రెండ్స్ ని మొదలు పెట్టేవారు సినిమాలు సరిగా చూడరు. అలాంటి వారిని పట్టించుకోకపోవటమే బెటర్.. అంటూ బదులిచ్చారు. తమ్మారెడ్డి మాటల్ని వింటే.. లైగర్ సినిమా మీద కంటే కూడా.. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరునే టార్గెట్ చేసినట్లుగా అనిపించక మానదు.