బ్రహ్మాస్త్రానికి రాజమౌళి ఎలివేషన్

నార్త్ ఇండియలో సౌత్ సినిమాలు ఇరగాడేస్తుంటే.. బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడడం సంగతలా ఉంచితే, తమ హోమ్ గ్రౌండ్లో కూడా చతికిల పడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చే సినిమా కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. ప్రస్తుతానికి వారి ఆశలు ‘బ్రహ్మాస్త్ర’ మీదే ఉన్నాయి. ఈ నెల 9న రిలీజవుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున లాంటి భారీ తారాగణం ఉంది. యే దిల్ హై ఏ జవాని లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన అయాన్ ముఖర్జీ దీని దర్శకుడు.

కరణ్ జోహార్ నిర్మాణంలో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించారు. రెండు నెలల కిందటే ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ లాంచ్ చేసి, చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్లు చేస్తున్నారు. దక్షిణాదిన కూడా పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నారు. మన దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాక.. దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండడం విశేషం.

‘బ్రహ్మాస్త’ గురించి తాజాగా రాజమౌళి ఒక వీడియో రూపంలో ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందే, 2015లోనే తనకు అయాన్ ‘బ్రహ్మాస్త’ కథను నరేట్ చేసినట్లు రాజమౌళి వెల్లడించాడు. తనకు ఈ కథలో అత్యంత నచ్చిన విషయం.. మన పురాణాలను అనుసరించి కథను అల్లడమే అని రాజమౌళి తెలిపాడు.

మన జీవనానికి ఆధారం పంచ భూతాలని, వాటి నేపథ్యంలో ఐదు శక్తిమంతమైన అస్త్రాల గురించి మన పురాణాల్లో చెప్పారని పేర్కొంటూ ఒక్కో అస్త్రం ఎంత శక్తిమంతమైందో రాజమౌళి సినిమా భాషలో వివరించే ప్రయత్నం చేశాడు. ఇందులో ఒక్కో అస్త్రానికి సూచికగా సినిమాలో ఒక్కో పాత్ర ఉంటుందని.. ఇలా కథను అల్లడం చాలా గొప్ప విషయమని రాజమౌళి చెప్పాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక విజువల్ వండర్ లాగా ‘బ్రహ్మాస్త్ర’ను అయాన్ అండ్ టీం తీర్చిదిద్దిందని.. డిస్నీ సంస్థ వరల్డ్ వైడ్ దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోందని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేశాడు.