బెజవాడ పోలీసుల్ని భయపెడుతున్న సెప్టెంబరు 1

నెల తర్వాత నెల రావటం కొత్తేం కాదు కదా? దానికి భయపడాల్సిన అవసరం లేదు కదా? సాధారణంగా కొత్త నెల ఆరంభం.. అందునా ఒకటో తారీఖు అన్నంతనే జీతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఉద్యోగులు. ప్రభుత్వమైనా.. ప్రైవేటు ఉద్యోగం అయినా ఒకటో తారీఖు వచ్చే జీతం మీద అందరి కళ్లు ఉంటాయి. అందుకు భిన్నంగా ప్రస్తుతం బెజవాడ పోలీసులకు సెప్టెంబరు ఒకటో తేదీ టెన్షన్ గా మారింది. ఈ గండం నుంచి ఎలా బయటపడతామన్నది ఇప్పుడు వారికో సవాలుగా మారింది. ఇంతకీ బెజవాడ పోలీసుల్ని టెన్షన్ పుట్టిస్తున్న సెప్టెంబరు ఒకటో తేదీన ఏం జరగనుంది? అన్న విషయంలోకి వెళితే..

సీపీఎస్ రద్దు కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు ఒకటిన తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించటంతో పాటు.. విజయవాడలో ప్రదర్శన.. సభను నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజున ఏం జరుగుతుందన్నది టెన్షన్ గా మారింది. దీనికి కారణం.. ఈ ఏడాది ఫిబ్రవరి మూడున బెజవాడలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ను నిర్వహించటమే. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా ఉండటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేయటం.. పలు రైల్వేస్టేషన్లు.. బస్టాండ్లలో పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసి.. విజయవాడకు వెళ్లకుండా అడ్డుకోవటం తెలిసిందే.

అయినప్పటికీ అనూహ్యంగా వేలాది మంది రోడ్ల మీదకు రావటం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా రాష్ట్ర ప్రభుత్వానికి షాకింగ్ గా మారటమే కాదు.. భారీ నిర్భంధంలోనూ విజయవాడకు ఇంత భారీగా ఎలా చేరుకున్నారన్న విస్మయం వ్యక్తమైంది. నిజానికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారీ ఎదురుదెబ్బ పడిందన్న మాట బలంగా వినిపించింది. జిల్లాల్లో ఉన్న ఆంక్షల్ని అధిగమించి తాము అనుకున్న ధర్నాకు ఒక రోజు ముందే తమ బంధువుల ఇంటికి.. స్నేహితుల ఇంటికి చేరుకున్న ఉద్యోగులు.. తాము అనుకున్న సమయానికి ఒక్కసారిగా రోడ్ల మీదకు రావటం… నిమిషాల వ్యవధిలో బీఆర్టీఎస్ రోడ్డులో వేలాదిగా చేరటంతో పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి.

దీనిపై సీఎం జగన్ తీవ్ర  అసహనం వ్యక్తం చేయటంతో పాటు.. పోలీసులకు భారీగా అక్షింతలు వేసినట్లుగా చెబుతారు. పాత అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్న పోలీసులు.. అలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండటం కోసం ముందస్తు జాగ్రత్తగా.. విజయవాడలోని ప్రతి లాడ్జిని.. ఓయో రూంలను ముందస్తు జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొనే వారికి రూములు అద్దెకు ఇస్తే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాదు.. గంపగుత్తగా గదులు బుక్ చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోటళ్లు.. పంక్షన్ హాళ్ల యజమానులకు పోలీసులు ముందుగానే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో మాదిరి సీన్లు రిపీట్ కాకూడదన్న మాట వినిపిస్తోంది. గతంలో ఎదురైన వైఫల్యాల్ని ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మాట బలంగా వినిపిస్తోంది. పోలీసుల తీరుపై గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు.. తాము పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. పోలీసులకు సెప్టెంబరు ఒకటో తేదీ టెన్షన్ పట్టుకుంది.