పూరి దగ్గర సుక్కు అసిస్టెంట్‌ అవుదామనుకుని..

ఇప్పుడు సుకుమార్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. రాజమౌళి తర్వాతి స్థానం ఆయనదే అంటే అతిశయోక్తేమీ కాదు. ఆయనతో పోలిస్తే పూరి జగన్నాథ్ రేంజ్ ఇప్పుడు తక్కువే. ఐతే ఒకప్పుడు సుకుమార్‌కు పూరి పెద్ద ఇన్‌స్పిరేషన్ అట. ఆయన సినిమాలు తనపై ఎంతో ప్రభావం చూపాయట. పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడానికి సుకుమార్ గట్టి ప్రయత్నమే చేశాడట. అంతే కాక ఆయన్ని కలిశాడట కూడా. ఈ అనుభవం గురించి ‘లైగర్’ ప్రమోషన్లో భాగంగా పూరిని తాను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా సుకుమార్ వెల్లడించాడు.

ఆ ఘటన గురించి తనకేమీ గుర్తు లేదంటూ పూరి ఆ కథేంటో ఆసక్తిగా తెలుసుకున్నారు. తాను మ్యాథ్స్ లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వద్దామని హైదరాబాద్ వచ్చినప్పటికి ‘బద్రి’ సినిమా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిందని.. అప్పుడు పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరుదామని భావించి, పూరితో పరిచయం ఉన్న తన మావయ్య ఒకరి ద్వారా ఆయన్ని కలిశానని సుక్కు వెల్లడిచాడు. అమీర్ పేటలో పూరి రెగ్యులర్‌గా టీ తాగే హోటల్ దగ్గర కాపు కాసి ఆయన్ని కలిశానని.. అప్పుడు తన వివరాలు అడిగి ఏదైనా మంచి కథ రాశావా చెప్పు అని అడిగాడని సుక్కు గుర్తు చేసుకున్నాడు.

తనను టెస్ట్ చేయడానికి, సినిమాల విషయంలో సీరియస్‌గా ఉన్నానా అని తెలుసుకోవడానికి పూరి అప్పుడు అలా అడిగి ఉండొచ్చని సుక్కు తెలిపాడు. ఐతే తాను కథ చెప్పానా.. తర్వాత ఏమైంది అన్నది సుక్కు చెప్పలేదు. ఇక ప్రతి దర్శకుడి భార్యా పూరి లాగా సినిమాలు తీయమని తన భర్తకు చెబుతుందని సుక్కు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం.

తామంతా రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తుంటామని.. విపరీతంగా టెన్షన్ పడుతుంటామని.. చాలా కష్టపడుతున్నట్లు బిల్డప్ ఇస్తామని.. కానీ పూరి మాత్రం ఆడుతూ పాడుతూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చకచకా సినిమాలు చేసుకుపోతుంటారని.. అందుకే ప్రతి దర్శకుడి భార్యా పూరీని చూసి నేర్చుకోమని అంటుందని సుక్కు అన్నాడు. పూరి సినిమాల్లో ‘ఇడియట్’ ఒక సెన్సేషన్ అని.. అందులో లవ్ సీన్లు చాలా కొత్తగా ఉంటాయని.. హీరో క్యారెక్టరైజేషన్ చూసి అప్పట్లో తనలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లకు పిచ్చెక్కిపోయిందని.. దర్శకులందరూ కొత్తగా ఆలోచించడం ఆ సినిమాతోనే మొదలైందని సుక్కు అభిప్రాయపడ్డాడు.