డైరెక్టర్ లింగుస్వామికి జైలుశిక్ష

చిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు తలనొప్పిగా మారటమే కాదు.. పేరు ప్రఖ్యాతుల్ని భారీగా డ్యామేజ్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు.. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే లింగుస్వామి తమిళులకే కాదు.. తెలుగుప్రేక్షకులకు సుపరిచితుడు. అలాంటి ఆయనకు తాజాగా న్యాయస్థానం ఒకటి ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

చెక్ బౌన్స్ కేసులో ఆయనకీ శిక్ష పడింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. పాపులర్ దర్శకుడైన లింగుస్వామి తెలుగు హీరో రామ్ తో ఈ మధ్యనే వారియర్ అనే మూవీని తెరకెక్కించటం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయింది. దర్శకుడిగానే కాదు లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పేరుతో పలు సినిమాల్ని నిర్మించారు.

ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం తెలుగు చిత్రాల్ని నిర్మించే ‘పీవీపీ సినిమాస్’ అనే సంస్థ నుంచి లింగుస్వామి సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. కార్తి.. సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో సినిమా తీయాలని అనుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కలేదు. దీంతో పీవీపీ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో లింగుస్వామి.. ఆయన సోదరుడు తిరిగి ఇచ్చేశారు.

అయితే.. బ్యాంకులో మాత్రం ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో.. పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన కేసు విచారణ తాజాగా కోర్టుకు వచ్చింది. ఈ కేసు పూర్వపరాలు చూసిన న్యాయమూర్తి లింగుస్వామికి ఆర్నెల్లు జైలుశిక్షను విధించటంతో పాటు.. వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో లింగుస్వామి సోదరులు అప్పీలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. చెక్ బౌన్స్ వ్యవహారం ఆయన ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసింది.