ఆ నిర్మాత లక్కు మామూలుగా లేదు

అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో మార్మోగుతున్న పేరు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసే ఈ నిర్మాత ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలో రెండు భారీ విజయాలందుకున్నాడు. అందులో ఒకటి ‘ది కశ్మీర్ ఫైల్స్’ కాగా.. మరొకటి ‘కార్తికేయ-2’. ఈ రెండు చిత్రాలకు ముందు ఆయన కెరీర్లో అంతగా విజయాలు లేవు. ‘గూఢచారి’ మినహా అభిషేక్ నిర్మించిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. కిరాక్ పార్టీ, సీత, ఎ-1 ఎక్స్‌ప్రెస్ లాంటి ఫ్లాపులు ఎదుర్కొన్నారాయన.

ఇలాంటి ట్రాక్ రికార్డుతో ఇండస్ట్రీలో చాలా రోజులు నిలవడం అంటే కష్టమే. కానీ హిందీలో తక్కువ బడ్జెట్లో ఆయన నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా అద్భుతాలు చేసింది. విడుదలయ్యే ముందు పెద్దగా అంచనాలే లేని ఈ చిత్రం.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా రూ.340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.

ఈ సినిమాతో అభిషేక్ అగర్వాల్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విజయంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అభిషేక్‌కు ఇప్పుడు ‘కార్తికేయ-2’ రూపంలో మరో జాక్‌పాట్ తగిలింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మించాడు అభిషేక్. చిత్రీకరణ ఆలస్యం కావడంతో, విడుదల పలుమార్లు వాయిదా పట్టి ఎట్టకేలకు గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. వారం తిరిగేసరికి పెట్టుబడి మీద రెట్టింపు షేర్ తెచ్చిపెట్టింది. రెండో వారంలోనూ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది.

హిందీలో కేవలం 50 షోలతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడు 3 వేలకు పైగా షోలతో నడుస్తోంది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఫుల్ రన్ వసూళ్లు వంద కోట్లకు చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సినిమా అంత స్ట్రాంగ్‌గా సాగుతోంది. అభిషేక్‌కు ఘనవిజయాలందించిన ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాలు రెండింట్లోనూ ‘హిందూ ప్రో’ యాంగిల్ ఉండడం ప్లస్ పెద్ద ప్లస్ కావడం గమనార్హం.