తక్కువ టైంతో ఎక్కువ మాస్

గత కొన్నేళ్లలో భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలన్నీ దాదాపుగా మూడు గంటలకు దగ్గరగా వెళ్ళినవే. మ్యాటర్ బలంగా ఉన్నప్పుడు అంత సేపు థియేటర్లో కూర్చోవడానికి ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది పడటం లేదు. సీతారామం లాంటి క్యూట్ లవ్ స్టోరీ సైతం రెండుముప్పావు దాకా వెళ్ళింది. ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ లైగర్ మాత్రం ఈ విషయంలో రిస్క్ తీసుకోకుండా కథనంతో పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యింది. ఫైనల్ రన్ టైం కేవలం 2 గంటల 20 నిముషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.

అందులోనూ ఆరు పాటలు ఏడు ఫైట్లతో ఇంత నిడివి అంటే చాలా రీజనబుల్. అవసరం లేని ల్యాగ్ సీన్లు, సాగతీత ఎమోషన్లు గట్రా ఏవీ ఉండవని అర్థమవుతోంది. మాములుగానే పూరి జగన్నాధ్ మూవీస్ అన్నీ స్క్రీన్ ప్లే పరంగా పరుగులు పెడతాయి. మహేష్ బాబు బిజినెస్  మెన్ కి క్రిస్పీ రన్ టైం లాక్ చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. అలాంటిది ఇంత గ్రాండ్ స్కేల్ లో, మైక్ టైసన్ లాంటి ఇంటర్నేషనల్ బాక్సర్ ని పెట్టుకుని ఇలా కట్ చేయడమంటే విశేషమే. సో బోరింగ్ మూమెంట్స్ పెద్దగా ఉండవని తేలిపోయింది.

ఇక బుకింగ్స్ విషయానికి వస్తే లైగర్ దూకుడు తెలంగాణలో భారీగా ఉంది. తెల్లవారుఝామున 7 నుంచే షోలు మొదలుపెట్టబోతున్నారు. దాదాపు వాటి టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ చేసినట్టుగా చెబుతున్న లైగర్ థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు పైగా చేశారని ట్రేడ్ రిపోర్ట్. ఇది రౌడీ కెరీర్ లోనే అత్యధిక మొత్తం. వరల్డ్ వైడ్ చూసుకుంటే 90 కోట్లకు చేరువలో ఉంది. మరి విజయ్ అన్నట్టు డబుల్ సెంచరీని లైగర్ ఈజీగా దాటేస్తుందా చూడాలి.