అన్నదమ్ముల గ్యాప్ రెండు వారాలే

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతమైన అనుమానాల మధ్య ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు 2023 మార్చి 30న రిలీజవుతుందని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో నిర్మాత ఏఎం రత్నం చెప్పేయడంతో అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఇంకా అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించలేదు కానీ స్వయానా ప్రొడ్యూసరే చెప్పారు కాబట్టి డౌట్ అక్కర్లేదు. ఆగిపోయిందని ఇంకా లేట్ అవుతుందని ఏవో ప్రచారాలు జరుగుతున్నాయని, గ్రాండియర్ కాబట్టి కొంత ఆలస్యమయ్యిందని రత్నం క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు చిరంజీవి భోళా శంకర్ ఏప్రిల్ 14 డేట్ ని లాక్ చేసుకుని కొత్త పోస్టర్ తో ఉదయం విషెస్ చెప్పేశారు. మెగా బ్రదర్స్ మధ్య థియేట్రికల్ గ్యాప్ కేవలం రెండు వారాలే ఉండబోతోంది. హరి హర వీర మల్లు లాంటి ప్యాన్ ఇండియా మూవీకి కనీసం మూడు వారాల బాక్సాఫీస్ స్పేస్ దొరకడం అవసరం. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దాని తర్వాత వచ్చేవి ఇబ్బంది పడతాయి. కాకపోతే ఇక్కడ రెండు సినిమాల నిర్మాతలు రత్నం, అనిల్ సుంకరలు ముందుగా అనుకుని ఇలా ప్లాన్ చేసుకుని ఉండరు. అందుకే ఇలా జరిగింది.

చిరు పవన్ లు ఇలా తలపడటం అరుదుగా జరిగేది. 1998లో నెలకంటే తక్కువ నిడివిలో తొలిప్రేమ, చూడాలని ఉంది వచ్చాయి. ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లే. కాబట్టి ప్రభావం పడలేదు. అది కూడా ముప్పై రోజుల నిడివి కనక ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడలా కాదు. సరే బలమైన కంటెంట్ ఉంటే ఇదేం పెద్ద సమస్య కాదు. హరిహర వీరమల్లుకు క్రిష్ దర్శకత్వం వహించగా భోళా శంకర్ ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఇద్దరి గత చిత్రాలు డిజాస్టర్లే. సో వీటితోనే బలమైన కం బ్యాక్ ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.