అశ్వినీదత్ చివరి సినిమా అదేనట

టాలీవుడ్లో సుదీర్ఘ, ఘన చరిత్ర ఉన్న నిర్మాతల్లో అశ్వినీదత్ ఒకరు. 50 ఏళ్ల ముందు ప్రొడక్షన్ మొదలుపెట్టి ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూ యాక్టివ్‌గా సినిమాలు తీస్తున్నారంటే విశేషమే. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-కే’కు ఆయనే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. మధ్యలో ‘శక్తి’ సహా కొన్ని డిజాస్టర్ల కారణంగా ఇబ్బంది పడ్డప్పటికీ.. తర్వాత పుంజుకుని ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, తాజాగా ‘సీతారామం’ లాంటి ఘనవిజయాలతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు.

‘ప్రాజెక్ట్-కే’ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే నిర్మాతగా ఆయన పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగడం ఖాయం. దీన్ని దత్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు అందరరూ. ఐతే ఆయన మాత్రం దీన్ని మించిన కలల చిత్రం ఒకటి తన మదిలో ఉన్నట్లు చెప్పారు. ఎప్పట్నుంచో కలగంటున్న ఆ సినిమాను తెరకెక్కించేసి తాను సినిమాల నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏది అంటారా..? జగదేక వీరుడు అతిలోక సుందరి-2.

ఒకప్పుడు దత్ కెరీర్లోనే కాక తెలుగు సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ తీయాలన్న తన కల అని గతంలోనూ దత్ చెప్పాడు. తాజాగా ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ చిత్రం గురించి మరోసారి ప్రస్తావించారు. నిర్మాతగా తాను చేయాలనుకుంటున్న చివరి సినిమా అదే అని.. ఎప్పటికైనా ఆ చిత్రం కచ్చితంగా చేస్తానని చెప్పారు. చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సీక్వెల్ అంటే ఆటోమేటిగ్గా అందరికీ రామ్ చరణే గుర్తుకు వస్తాడు.

దత్ ఆలోచన కూడా తనతోనే ఆ సినిమా చేయాలనే. కాకపోతే ఇందుకోసం కథ ఎవరు తయారు చేస్తారు.. అప్పుడు రాఘవేంద్రరావు తరహలో ఇప్పుడు వెండితెరపై మ్యాజిక్ ఎవరు క్రియేట్ చేస్తారు అన్నది ప్రశ్న. అలాంటి పాంటసీ కథను సరిగ్గా డీల్ చేయగల దర్శకుడంటే దర్శకేంద్రుడి శిష్యుడైన రాజమౌళే గుర్తుకు వస్తాడు. మరి ఈ కాంబినేషన్‌ సెట్ అయి దత్ అనుకున్నట్లుగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి-2’ సినిమా కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.