మాస్ రాజా కొత్త సంతకం

మాస్ మహరాజా రవితేజ కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంటోంది. ‘రాజా ది గ్రేట్’తో లేక లేక ఒక హిట్ కొట్టిన మాస్ రాజా.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఆపై అతను ‘క్రాక్’తో తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఈ సినిమా కరోనా టైంలో రిలీజై మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ఈ ఊపును తర్వాతి సినిమాలు కొనసాగించట్లేదు. ఈ ఏడాది వేసవిలో వచ్చిన రవితేజ కొత్త చిత్రం ‘ఖిలాడి’ తుస్సుమనిపించింది. ఐతే దానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి.

కానీ ఇప్పుడు రవితేజ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’కి ప్రి రిలీజ్ కరవైంది. తొలి రోజు టాక్‌ను బట్టే సినిమా భవిష్యత్ ఆధారపడి ఉండగా.. బ్యాడ్ టాక్ సినిమాకు పెద్ద మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఇక రవితేజ అభిమానుల ఆశలన్నీ తర్వాతి చిత్రాల మీదికి వెళ్లాయి. ఆయన ప్రస్తుతం ‘రావణాసుర’తో పాటు ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకో ఆరు నెలల్లో ఈ సినిమాలన్నీ పూర్తయిపోతాయి. ‘ధమాకా’ లేదా ‘రావణాసుర’ ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. కొత్త ఏడాదిలో తొలి ఆరు నెలల్లో మిగతా రెండు చిత్రాలు వచ్చేయొచ్చు. ఆ తర్వాత మాస్ రాజా నుంచి వచ్చే సినిమా ఏదనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. శరవేగంగా సినిమాలు చేసే రవితేజ.. చేతిలో మూడు సినిమాలుండగానే మరో సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం.

మాస్ డైరెక్టర్ శ్రీవాస్‌తో ఆయన ఓ చిత్రం చేయనున్నాడట. ‘లక్ష్యం’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీవాస్‌కు ఆ తర్వాత ‘లౌక్యం’ మినహా హిట్ లేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సాక్ష్యం’ నిరాశ పరిచింది. తర్వాత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది ఈ ఏడాదే పూర్తవుతంది. ఈ లోపు రవితేజకు అతను ఒక మాస్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.