దిల్ రాజు.. లబ్ డబ్

కొవిడ్ తర్వాత వేగంగా మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచిని, థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడంలో వారి అయిష్టతను అందరి కంటే ముందే పసిగట్టాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. అందరూ ఈ విషయంలో ఎలా స్పందించాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయంలో ఉండగా.. దిల్ రాజు మీడియా ముందుకొచ్చి కఠిన వాస్తవాలు చెప్పారు. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే థియేటర్ల రెవెన్యూ బాగా పడిపోయిందని, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా తగ్గుతోందని.. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షించుకుని అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించాడాయన.

ఈ క్రమంలో త్వరలో మొదలుపెట్టాల్సిన సినిమాలను ఆపేయడంతో పాటు సెట్స్ మీద ఉన్న సినిమాల విషయంలో మళ్లీ వర్క్ చేయిస్తున్నట్లు రాజు చెప్పడం గమనార్హం. ఇందుకు బయటి సినిమాలతో పాటు రాజు చిత్రాలకు థియేటర్లలో వస్తున్న అంతంతమాత్రం స్పందన కారణమై ఉండొచ్చు.

ఇప్పటికే దిల్ రాజుకు ‘ఎఫ్-3’ రూపంలో ఒక షాక్ తగిలింది. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ.. బయ్యర్ల పెట్టుబడి అయితే వెనక్కి రాలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు ‘థాంక్యూ’ మీద ఆశలు పెట్టుకున్నారాయన. దిల్ రాజు బేనర్‌కున్న బ్రాండ్ వాల్యూతో పాటు ‘మనం’ తర్వాత నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్లు. కానీ ‘థాంక్యూ’ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆశాజనకంగా లేవు. నెల రోజులకు పైగా స్లంప్‌లో ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ.. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా నడుస్తున్నాయి.

బుక్ మై షో చూస్తే ఎక్కడా సోల్డ్ ఔట్ మెసేజ్ అన్నడే కనిపించడం లేదు. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న స్క్రీన్లు కూడా చాలా చాలా తక్కువే. కొవిడ్‌కు ముందైతే ఈ రేంజ్ సినిమాకు చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయేవి. శుక్రవారం ఈ చిత్రానికి వాక్-ఇన్స్ కలిపినా కూడా హౌస్ ఫుల్స్ పడడం సందేహంగానే ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రావడం కీలకం. అప్పుడే వీకెండ్లో వసూళ్లు బాగా వస్తాయి. అందుకే టాక్ ఎలా ఉంటుందో అని దిల్ రాజు అండ్ టీం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.