హీరో అభిమానులపై కేసు పెట్టిన దర్శకుడు

తమ హీరోల్ని అనుకోకుండా ఎవరైనా ఒక మాట అన్నా.. విమర్శ చేసినా వారి అభిమానులు తట్టుకునే పరిస్థితి లేదిప్పుడు. సోషల్ మీడియా వేదికగా అవతలి వాళ్లపై తీవ్ర స్థాయిలో దాడి చేయడం మామూలైపోయింది. ఐతే ఇలాంటి వాటిని చాలా వరకు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ రోజు రోజుకూ హీరోల అభిమానులు శ్రుతి మించి పోతుండటం.. బూతులు తట్టి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుండటంతో కొందరికి మండిపోతోంది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్తోంది. ఈ మధ్య తనను టార్గెట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మీద హీరోయిన్ మీరా చోప్రా విరుచుకుపడటం, పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిన సంగతే. తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సైతం ఇదే బాట పట్టాడు. అతను మహేష్ బాబు అభిమానుల మీద సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తరుణ్ ఇటీవల మలయాళ మూవీ ‘కప్పెల’ చూసి దాని మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడని.. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో రీఎంట్ర ీఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో’’.. ఇలా కౌంటర్లు వేశాడు తరుణ్. టాలీవుడ్ కమర్షియల్ సినిమాలను అతను టార్గెట్ చేశాడన్నది స్పష్టం. ఐతే ప్రధానంగా ఈ వ్యాఖ్యలు మహే‌ష్‌కే తగిలాయి. ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మీద అతను కౌంటర్ వేసినట్లు భావించి అతడి అభిమానులు తరుణ్‌‌ను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

దానికి ప్రతిగా తరుణ్ కూడా దీటుగా స్పందించాడు. తనను టార్గెట్ చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా వాళ్లు తగ్గలేదు. ట్రోలింగ్ కొనసాగించారు. దీంతో తరుణ్ పోలీసులను ఆశ్రయించాడు. మహేష్ ఫ్యాన్స్ అని చెప్పకుండా సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్ చేయడమే కాక దుర్భాషలాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వేధింపులకు పాల్పడిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు మరియు ఆధారాలు అన్ని పోలీసులకు సమర్పించినట్లు తరుణ్ వెల్లడించాడు.