ఈగ విలన్ మూవీ రిస్క్ చేస్తోందా

వచ్చే వారం విడుదల కాబోయే సినిమాల్లో మనవాళ్ళ దృష్టి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మీదే ఉంది కానీ ఒక రోజు ముందు ఈగ విలన్ సుదీప్ నటించిన విక్రాంత్ రోనా కూడా వస్తోంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. కెజిఎఫ్ తర్వాత శాండల్ వుడ్ లో తీసిన అత్యంత కాస్ట్లీ మూవీగా దీని గురించి పబ్లిసిటీ చేస్తున్నారు. సుదీప్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి అఖిల్ తదితరులతో ట్రైలర్ లాంచ్ చేసి ఇక్కడి మీడియాతో మాట్లాడాడు కూడా. ఆ తర్వాత పెద్దగా సౌండ్ లేదు.

నిజానికిది రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో కరోనా టైంలో దీన్ని ఓటిటికి ఇస్తారని అంత పెద్ద డీల్ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ నిర్మాత దాన్ని కొట్టిపారేసి థియేటర్లకే వస్తామని క్లారిటీ ఇచ్చారు. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో బ్యాక్ డ్రాప్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. విజువల్స్ ని గ్రాండ్ గా చూపించారు. అంతే కాదు కంప్లీట్ త్రీడి మూవీగా చాలా ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడే ఉంది అసలు చిక్కు

గతంలో అతడే శ్రీమన్నారాయణ అనే మూవీకి ఇదే టైపు లో హంగామా చేశారు. 777 ఛార్లీ హీరో రక్షిత్ శెట్టి మనకు పరిచయమయ్యింది దాంతోనే. వెరైటీగా ఏదో తీశారు కానీ మన ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. సో ఫ్లాప్ తప్పలేదు. ఇప్పుడు విక్రాంత్ రోనా ఏదో మేజిక్ చేస్తేనే మన ప్రేక్షకులు ఆదరిస్తారు. పైగా రామారావు ఆన్ డ్యూటీకి మాస్ ఆడియన్స్ సపోర్ట్ దక్కితే ప్రభావం గట్టిగానే ఉంటుంది. చేతిలో ఇంకో పది రోజుల దాకా టైం ఉంది కాబట్టి ఈలోగా లో ప్రొఫైల్ లో ఉన్న బజ్ ని పెంచేందుకు సుదీప్ ఎలాంటి ప్లాన్ వేస్తారో మరి.