దిల్ రాజైనా మాట నిలబెట్టుకుంటాడా?

ఇప్పుడు తెలుగులో ప్రతి కొత్త సినిమా విడుదల ముంగిటా టికెట్ల ధరలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏ సినిమాకు ఎంత రేటు పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. అసలే కోవిడ్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోగా.. తెలుగు రాష్ట్రాల్లో పరిమితికి మించి రేట్లు పెంచేయడం వారిని మరింతగా వెండితెరకు దూరం చేస్తున్న విషయం స్పష్టం. కొన్ని పెద్ద సినిమాల మీద ఈ ప్రభావం గట్టిగా పడిన నేపథ్యంలో చిన్న, మీడియం రేంజ్ చిత్రాలకు రేట్లు తగ్గించి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే ఇటీవల ‘పక్కా కమర్షియల్’ సినిమాకు బాగా రేట్లు తగ్గించబోతున్నట్లు.. దాదాపు కొవిడ్‌కు ముందు లాగా సింగిల్ స్క్రీన్లలో 110, మల్టీప్లెక్సుల్లో 177 రేటు పెట్టబోతున్నట్లు ఘనంగా ప్రకటించారు. కానీ తీరా చూస్తే వాళ్లు చెప్పిన రేట్లు అమలు కాలేదు. అసలే సినిమాకు నెగెటివ్ టాక్ రాగా, దీనికి తోడు రేట్లు తగ్గకపోవడం సినిమాకు చేటు చేసింది. ఆ టైంలో గీతా ఆర్ట్స్ అధినేతల మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

ఐతే ఇప్పుడు మరో అగ్ర నిర్మాత దిల్ రాజు లైన్లోకి వచ్చాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘థ్యాంక్ యు’ మూవీకి రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నెల 22న థియేటర్లలో దిగబోతున్న ఈ చిత్రానికి తెలంగాణ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.112, మల్టీప్లెక్సుల్లో మెజారిటీ స్క్రీన్లలో రూ.177 రేటు ఉంటుందని ప్రకటించాడు. ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న మాదిరే సింగిల్ స్క్రీన్లలో రూ.147.5, మల్టీప్లెక్సుల్లో రూ.177గా రేట్లు కొనసాగబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

‘థ్యాంక్ యు’ యూత్, ఫ్యామిలీస్‌ను బాగానే ఆకర్షించగల చిత్రం. నిజంగా దిల్ రాజు చెప్పిన రేట్లే పెడితే సినిమాకు ప్రయోజనం ఉంటుంది. గత వారం వచ్చిన ‘ది వారియర్’ సినిమాకు సింగిల్ స్క్రీన్లలో రూ.175, మల్టీప్లెక్సుల్లో రూ.295 రేట్లతో టికెట్లు అమ్మారు. అసలే వర్షాలు, పైగా నెగెటివ్ టాక్‌ తెచ్చుకున్న సినిమాకు ఈ రేట్లు బాగా ప్రతికూలం అయ్యాయి. సినిమా దారుణంగా దెబ్బ తింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు అయినా మాట మీద నిలబడి ఈ రేట్లతో సినిమాను రిలీజ్ చేస్తాడేమో చూడాలి.