ఆదిపురుష్.. ఈ కబురు చెప్పారు చాలు

‘తానాజీ’ లాంటి భారీ చిత్రం చేసిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో మన ప్రభాస్ భారీ బడ్జెట్లో సినిమా చేస్తున్నాడని చాలా సంబరపడ్డారు అప్పట్లో అభిమానులు. కానీ ఈ సినిమా ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ కాలేదు ఆ సినిమా నుంచి. షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమా నుంచి ఇంతవరకు ఒక్క ప్రోమో కూడా లాంచ్ చేయకపోవడం పట్ల ప్రభాస్ అభిమానుల ఆగ్రహం మామూలుగా లేదు.

సోషల్ మీడియాలో దర్శకుడు ఓం రౌత్ అండ్ టీంను తిట్టి తిట్టి అలసిపోయి ఊరుకుండిపోయారు వాళ్లు. అసలే ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత రెండు పెద్ద డిజాస్టర్లు ఎదుర్కొని ఇబ్బందుల్లో ఉంటే.. ‘ఆదిపురుష్’కు బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం విఫలమవుతోందనేది వాళ్ల బాధ. కానీ ఓం రౌత్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజాగా అతను అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అప్‌డేట్ ఇచ్చాడు.

ఓం రౌత్ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నాడు. అక్కడ ఒక భారీ ఐమాక్స్ థియేటర్ ముందు నిలుచుని 2023 జనవరి 12వ తేదీ కోసం ఆగలేకపోతున్నట్లు వ్యాఖ్యానించాడు. తద్వారా తాను ‘ఆదిపురుష్’ పనిలోనే ఉన్నానని, ఈ సినిమా ముందు అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజవుతుందని రౌత్ క్లారిటీ ఇచ్చేసినట్లయింది. చాన్నాళ్లుగా అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో రాదో అన్న అనుమానంలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చేసినట్లే.

ఇక ఓం రౌత్ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నది ‘ఆదిపురుష్’ ఐమాక్స్ త్రీడీ వెర్షన్ టెస్టింగ్ కోసమే అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో, త్రీడీ-ఐమాక్స్ వెర్షన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి అంతా క్లియర్‌గా ఉండేలా ఓం రౌత్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ప్రాడక్ట్‌ను పక్కాగా రెడీ చేశాకే ప్రమోషన్లు మొదలుపెట్టాలని అతను భావిస్తుండొచ్చు.