సారీ.. మా సినిమా ఆ రోజు రావట్లేదు

యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘కార్తికేయ’. కొత్త దర్శకుడు చందు మొండేటి రూపొందించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 2014లో విడుదలై ఘనవిజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా ఇన్నేళ్ల తర్వాత ‘కార్తికేయ-2’ చేశారు నిఖిల్-చందు. మొదలైన దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం కొవిడ్ కారణంగా బాగా ఆలస్యమైంది.

ఎట్టకేలకు జులై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. మధ్యలో జోరుగా ప్రమోషన్లు కూడా నడిచాయి. కానీ కొన్ని రోజులుగా చిత్ర బృందం సైలెంటుగా ఉంటోంది. దీంతో 22న రిలీజ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు నిఖిల్ స్వయంగా తమ సినిమా వాయిదా పడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. యూకే డిస్ట్రిబ్యూటర్ 22నే రిలీజ్ అని బుకింగ్స్ ఓపెన్ చేసేయగా.. అక్కడి ప్రేక్షకులు కూడా ఆత్రంగా టికెట్లు బుక్ చేసేశారు. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న టికెట్ల అమ్మకం గురించి ఒక నెటిజన్ స్క్రీన్ షాట్ పెట్టి నిఖిల్‌ను ట్యాగ్ చేయగా.. అతను చావు కబురు చల్లగా చెప్పాడు.

“కానీ సారీ.. మా సినిమా జులై 22న విడుదల కావట్లేదు. ఆగస్టు తొలి వారంలో వస్తుంది. ప్రిమియర్ షోకు టికెట్లు బుక్ చేసిన వాళ్లకు క్షమాపణలు. ఆ డబ్బులు రీఫండ్ అవుతాయి” అని నిఖిల్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఐతే ‘కార్తికేయ-2’ అనే కాదు.. మరే సినిమా అయినా సరే వాయిదా వేస్తున్నట్లయితే కాస్త ముందుగానే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఒకసారి రిలీజ్ డేట్ ఇవ్వడం, డేట్ దగ్గర పడుతుండగా ఉన్నట్లుండి సైలెంట్ అయిపోవడం, ప్రేక్షకులను అయోమయానికి గురి చేయడం, తర్వాత ఆలస్యంగా వాయిదా విషయం వెల్లడించడం.. చాలామంది ఇలాగే చేస్తున్నారు.

కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో సినిమాల విడుదల వాయిదా పడడం చాలా మామూలు విషయం అయిపోయింది. ప్రేక్షకులు కూడా ఈ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవట్లేదు. బాగా అలవాటు పడిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలే పలుమార్లు వాయిదా పడి.. ఎన్నడూ లేని విధంగా ఈ డేట్ కాకపోతే ఆ డేట్ అంటూ ప్రకటనలు ఇచ్చే పరిస్థితి వచ్చినపుడు నేపథ్యంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు వాయిదా పడితే ప్రేక్షకులు ఆమాత్రం అర్థం చేసుకోలేరా?