తరుణ్ భాస్కర్ వెర్సస్ మహేష్ ఫ్యాన్స్

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి ఓ స్టార్ హీరో అభిమానులతో పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఓ అవార్డు విషయమై ‘జనతా గ్యారేజ్’ గురించి చేసిన వ్యాఖ్యలతో అతను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అప్పట్లో తారక్ ఫ్యాన్స్ తరుణ్‌‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కానీ అతనేమీ పట్టించుకోలేదు. ఐతే అప్పుడు తరుణ్ అనుకోకుండా ఆ వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు కొంచెం భిన్నమైన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే మన స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలపై కౌంటర్లు వేయడం.. ముఖ్యంగా మహేష్ బాబును టార్గెట్ చేయడంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మండిపోయింది. అతణ్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

తాజాగా తరుణ్ భాస్కర్ మలయాళ మూవీ ‘కప్పెల’ చూసి దాని మీద ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయం చెబుతూ.. మన కమర్షియల్ సినిమాల మీద కౌంటర్లు వేశాడు. ‘‘హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో రీఎంట్ర ీఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో’’.. ఇదీ తరుణ్ పోస్ట్ చేసిన మెసేజ్. ఇందులో టాలీవుడ్ కమర్షియల్ సినిమాలు చాలా వాటి మీదే కౌంటర్లున్నాయి. ఐతే చివరి పది నిమిషాల్లో రైతులు, సైనికులు, దేశం గురించి మెసేజ్ ఉండదు అనే కామెంట్ దగ్గర అందరూ మహేష్ సినిమాలు ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’లతో కనెక్ట్ అయ్యారు. తమ హీరో సినిమాల మీద కౌంటర్లు వేసినందుకు మహేష్ ఫ్యాన్స్ తరుణ్‌ను టార్గెట్ చేసుకుని బూతులు తిట్టేశారు. దీనికి తరుణ్ దీటుగానే స్పందించాడు. ఐడెంటిటీ లేకుండా ఫేక్ ఐడీలతో తనను ట్రోల్ చేసేవాళ్లను తాను పట్టించుకోనంటూ వాళ్లను తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తూ సోషల్ మీడియా పోస్టుతో కౌంటర్ చేశాడు.