నాకెంతో నచ్చిన పాత్ర.. ప్రేక్షకులకు నచ్చలేదు

‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ పరభాషా కథానాయికగా చూడట్లేదు. ఓ తెలుగమ్మాయిలాగే భావిస్తున్నారు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తెలుగు గడ్డే అయిన హైదరాబాద్‌లో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమె ఇప్పటిదాకా ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే అన్న సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. త్వరలోనే ‘థ్యాంక్ యు’తో పలకరించబోతోంది రాశి.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి పంచుకుంది. తాను ఢిల్లీ అమ్మాయిని అయినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని ఆమె అంది. రాజమండ్రిలో ‘ప్రతి రోజు పండగే’ చిత్రం కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడని, తాను ఆటోగ్రాఫ్ చేయగా.. దాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని.. ఆ క్షణం తనకు ఎంతో ఆనందం కలిగిందని, ఇలాంటి అభిమానులు ఉండడం తన అదృష్టమని రాశి పేర్కొంది.

తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో తాను చేసిన ప్రభావతి పాత్ర తనకెంతో ఇష్టమని.. ఆ తర్వాత అంతగా ఇష్టపడ్డ పాత్ర ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని యామినినే అని రాశి పేర్కొంది. కానీ తాను అంతగా ఇష్టపడ్డ పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ సినిమా రిలీజైనపుడు అందరూ తనను ట్రోల్ చేశారని రాశి పేర్కొంది. ఆ చిత్రంలో రాశి కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముందు నుంచి హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు ఉండడంతో ఆ బోల్డ్ సీన్లు చేయడం అభిమానులకు రుచించకపోయి ఉండొచ్చు. తనకు కాబోయే భర్త దైవ భక్తి ఎక్కువ ఉన్నవాడు, మంచి వాడు అయ్యుండాలని ఈ ఇంటర్వ్యూలో రాశి పేర్కొనడం విశేషం.