రూల్ పెట్టారు సరే.. ఫాలో అవుతారా?

టాలీవుడ్ ఓటీటీల్లో కొత్త సినిమాలను రిలీజ్ చేసే విషయంలో కఠిన వైఖరి అవలంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేందుకు 50 రోజుల విరామం ఉండాలని టాలీవుడ్ అగ్ర నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌లో ఈ మేరకు నిర్ణయం జరగబోతున్నట్లు మొన్న బన్నీ వాసు పేర్కొనగా.. తర్వాతి రోజు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

జులై 1 నుంచి కొత్తగా ఓటీటీ అగ్రిమెంట్ జరిగే ప్రతి సినిమాకూ ఈ షరతు వర్తిస్తుందని, తమతో సహా అందరం దీనికి కట్టుబడి ఉండాల్సిందే అని రవిశంకర్ స్పష్టం చేశారు. మైత్రీ సంస్థ నుంచి వచ్చిన సర్కారు వారి పాట, అంటే సుందరానికీ చిత్రాలను అటు ఇటుగా నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ చేయడం, అంతకుముందు ‘ఆచార్య’ మూవీ మూడు వారాలకే ప్రైమ్‌లోకి వచ్చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

మరీ ఇంత త్వరగా కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తే.. ఇక ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, దీర్ఘ కాలంలో ఇది చాలా నష్టం చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఐతే ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ.. ఈ షరతును అందరూ పాటిస్తారా అన్నది సందేహం. ఓటీటీలు 50 రోజుల తర్వాత సినిమాను రిలీజ్ చేస్తే అంత క్రేజ్, హైప్ ఉండదు. వారికి దక్కాల్సిన ప్రయోజనం దక్కకపోవచ్చు.

ఈ రోజుల్లో ఒకట్రెండు వారాలకు మించి కొత్త సినిమాలు థియేటర్లలో నిలవట్లేదు. ఇక అప్పట్నుంచి జనాలు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లు ఆసక్తి కోల్పోకముందే సినిమాను ఓటీటీలోకి తేవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటీటీలు మంచి ఆఫర్లు ఇస్తుంటే నిర్మాతలు టెంప్ట్ అవకుండా ఉండలేరు. పెద్ద నిర్మాణ సంస్థల సంగతి పక్కన పెడితే.. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలను నిర్మించే వాళ్లకు ఓటీటీ డీల్స్ చాలా ముఖ్యం. వాళ్లలో చాలామంది నిర్మాతలు దీర్ఘ కాలం సినిమాలు తీసేవాళ్లు అయి ఉండరు. వాళ్లకు ఇప్పుడు తీసే ఒకట్రెండు సినిమాలు ముఖ్యం. వాటి ద్వారా లభించే ఆదాయం కీలకం. వాళ్లంతా ఇండస్ట్రీకి దీర్ఘ కాలంలో జరిగే నష్టం గురించి ఆలోచించి ఈ షరతును అనుసరిస్తారా అన్నది డౌటు. అసలు పెద్ద నిర్మాతల్లో కూడా అందరూ దీనికి కట్టుబడి ఉంటారా అన్నదీ అనుమానమే.