త‌క్కువ రేట్లు.. ప‌బ్లిసిటీ గిమ్మిక్కా?

మా సినిమాకు టికెట్ల రేట్లు త‌క్కువ అని ప్ర‌చారం చేసుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది ఇప్పుడు. ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి కదా అని అయిన కాడికి రేట్లు పెంచేసుకోవ‌డం గ‌త ఏడాదితో పోలిస్తే 75-100 శాతం మ‌ధ్య రేట్లు పెరిగిపోవ‌డం.. అవి చాల‌వ‌న్న‌ట్లు పెద్ద సినిమాల‌కు అద‌నంగా వ‌డ్డిస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చిర్రెత్తుకొచ్చి థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తుండ‌డం తెలిసిందే. ఈ నెగెటివ్ ట్రెండ్ అర్థ‌మై ఈ మ‌ధ్య కొన్ని సినిమాల‌కు టికెట్ల రేట్లు కాస్త త‌గ్గించారు.

మేజ‌ర్, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌కు అది బాగా క‌లిసొచ్చింది కూడా. ఐతే ఈ విష‌యంలో గీతా ఆర్ట్స్ వాళ్లు మ‌రింత చొర‌వ తీసుకుని.. త‌మ నిర్మాణంలో తెర‌కెక్కిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రానికి ఇంకా రేట్లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ల‌లో 112, మ‌ల్టీప్లెక్సుల్లో 170కి అటు ఇటుగా రేట్లు ఉండ‌బోతున్న‌ట్లు ఈ సినిమా ప్రెస్ మీట్లో నిర్మాత బ‌న్నీ వాసు ఘ‌నంగా ప్ర‌క‌టించాడు.

దీని గురించి టాలీవుడ్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ఇలా రేట్లు త‌గ్గించ‌డం సినిమాకు ప్ల‌స్ అయి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య పెరిగితే.. మున్ముందు మ‌రిన్ని చిత్రాలు ఈ బాట ప‌ట్టొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. కానీ ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. రేట్లు మునుప‌టిలాగే ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌లో 150, మ‌ల్టీప్లెక్సుల్లో 200 రేటు కొన‌సాగుతోంది.

హైదరాబాద్ ఏఎంబీలో అయితే 295 రేటునే అమ‌లు చేస్తున్నారు. మేజ‌ర్, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌కు కూడా అక్క‌డ మాత్రం రేటు త‌గ్గించ‌లేదు. ఏపీలో కూడా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు ఇదే స్థాయిలో రేట్లు పెడుతున్న‌ట్లే ఉన్నారు. మ‌రి త‌మ చిత్రానికి రేట్లు అమాంతం త‌గ్గించేస్తున్న‌ట్లు అంత ఘ‌నంగా ప్ర‌క‌టించ‌డం కేవ‌లం పబ్లిసిటీ గిమ్మిక్కేనా.. లేక సాధార‌ణ రేట్ల‌నే కొన‌సాగిస్తుండ‌టం నిర్మాత‌ల దృష్టికి ఇంకా రాలేదా అన్న‌ది అర్థం కావ‌డం లేదు.