ఎం.ఎస్.రాజు మాటలు పట్టించుకుంటారా?

ఒకప్పటి ఎం.ఎస్.రాజు వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శత్రువు, దేవి, ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఘనవిజయాలతో ట్రెండ్ సెట్ చేసిన నిర్మాత ఆయన. ఇప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు.. తనకు ఎం.ఎస్.రాజునే స్ఫూర్తి అని చెబుతుంటాడు.

ఐతే ఒక దశ దాకాక వరుస పరాజయాలతో ఆయన దెబ్బ తిన్నారు. మధ్యలో బాగా గ్యాప్ తీసుకుని.. ‘డర్టీ హరి’ అనే చిన్న స్థాయి, బోల్డ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘డర్టీ హరి’ పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీలో రిలీజై సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోవలోనే కొడుకు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పెట్టి ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమా చేశాడు. శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది.

ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ పెట్టిన రాజు.. ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి గురించి, టికెట్ల ధరల ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిన టికెట్ల రేట్లు చిన్న సినిమాలకు శాపంగా మారాయని ఎం.ఎస్.రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలకు ఎంత రేటు పెట్టినా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారని.. కానీ చిన్న సినిమాలకు కూడా ఎక్కువ రేట్లు ఉంటే చాలా కష్టమని రాజు అన్నారు.


సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 200 టికెట్ల రేటు పెడితే ఒక చిన్న సినిమాను వచ్చి ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. సినిమా చాలా బాగుందంటే తప్ప ఈ రేట్లతో థియేటర్లకు రారని.. యావరేజ్ అని తెలియగానే ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అని ఆగిపోతారని.. ఇప్పుడు ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు ఉన్నాయని ఆయనన్నారు. తన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’కు ఒక థియేటర్లో రూ.200 రేటు ఉంటే అంత ఎందుకు పెట్టారని అడిగి తగ్గించే ప్రయత్నం చేసినట్లు రాజు వెల్లడించారు. ఈ రేట్లు కచ్చితంగా చిన్న సినిమాలను చంపేస్తాయని.. ఇండస్ట్రీలో పెద్దలందరూ చిన్న సినిమాలను కాపాడేందుకు రీజనబుల్ టికెట్ రేట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని రాజు కోరారు. సరిగ్గా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే రాజు మాట్లాడారని చెప్పాలి. మరి ఆయన మాటల్ని ఇండస్ట్రీ పెద్దలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి.