ఆ అమ్మాయి గురించి చెప్పడం లేదే

ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్స్ లో ఉన్న మొదటి పేరు కృతి శెట్టి. పూజా హెగ్డే, రష్మిక మందన్నలు మీడియం బడ్జెట్ సినిమాలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోవడంతో నిర్మాతలు ఉప్పెన భామను ఆఫర్లతో ముంచెత్తున్నారు.

తన లిస్టు పెద్దదే ఉంది కానీ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ మాత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ మూవీ ఇది. బెంచ్ మార్క్ స్టూడియోస్ తో పాటు మైత్రి దీనికి నిర్మాణ భాగస్వామిగా ఉంది.

ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్, లిరికల్ వీడియో అంటూ కొంత హడావిడి చేశారు కానీ ఆ తర్వాత అంతా సైలెన్స్. ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సర్కారు వారి పాట కన్నా ముందే మైత్రి సంస్థ దీని ప్రమోషన్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలోనూ సందడి కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఎందుకు మౌనం వహిస్తున్నారో అంతు చిక్కడం లేదు. ఈ మూవీకి సుధీర్ బాబు బ్రాండ్ కన్నా కృతి శెట్టి గ్లామరే ప్రధాన ఆకర్షణగా తోస్తోంది. శ్రీదేవి సోడా సెంటర్ ఫ్లాప్ అయ్యాక మళ్ళీ తన సాఫ్ట్ జానర్ కు వచ్చిన సుధీర్ దీని మీద చాలా నమ్మకంగా ఉన్నాడు.

దాదాపుగా ఆగస్ట్ దాకా రిలీజ్ డేట్లన్నీ లాక్ అయిపోయాయి. మెల్లగా సెప్టెంబర్ అనౌన్స్ మెంట్లు కూడా వచ్చేస్తున్నాయి. అయినా కూడా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాత్రం సౌండ్ చేయడం లేదు. సమ్మోహనం తర్వాత డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఇంద్రగంటి చేసిన రివెంజ్ డ్రామా ‘వి’ దారుణంగా దెబ్బ తినడం ఆయన్ని పునరాలోచనలో పడేసింది. అందుకే పాత స్కూల్ కు వచ్చేశారు. అసలే కీర్తి శెట్టి కెరీర్ వరస హిట్లతో మంచి స్పీడ్ మీదుంది. ఇదే ఫ్లోలో విడుదల చేసేస్తే పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుందేమో కదా. చూద్దాం.