కిడ్నాప్ ఫార్ములా ఇంకెన్నాళ్లో

అప్పుడెప్పుడో 1996 భారతీయుడులో కమల్ హాసన్ అన్యాయంగా కూతురు చావుకు కారణమైన వాళ్ళను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తాడు. ఒక డాక్టర్ ని ఏకంగా టీవీ ఛానల్ లైవ్ లో మర్డర్ చేసి సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత 2003 ఠాగూర్ (ఒరిజినల్ వెర్షన్ తమిళ రమణ) సినిమాలో చిరంజీవి లంచాలు ఎక్కువగా తీసుకుని ప్రజలను పీడించే ప్రభుత్వ అధికారులను తన స్టూడెంట్స్ సహాయంతో ఎత్తుకెళ్ళిపోయి వాళ్లకు మరణశిక్ష విధించి తానెందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో విజిల్స్ వచ్చేలా కోర్టులో చెబుతాడు.

అది మొదలు ఈ కిడ్నాప్ డ్రామాలు వాడుకుని ఎందరు దర్శకులు ఎందరు హీరోలు సినిమాలు చేశారో లెక్కబెట్టడం కష్టం. ఇటీవలే వచ్చిన సన్ అఫ్ ఇండియాలో మోహన్ బాబు చేసింది ఇదే. తన ఫ్యామిలీ బలవ్వడానికి ప్రతీకారంగా దానికి బాధ్యులైన వాళ్ళను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచుతాడు. తాజాగా సత్యదేవ్ గాడ్సేలోనూ ఇదే ప్రహసనం. ఒక పెద్ద వ్యాపారవేత్త రాజకీయ నాయకులను బడా వ్యక్తులను కిడ్నాప్ చేసి వ్యవస్థను ప్రశ్నిస్తాడు. దాని వెనుకున్న కారణాలు తర్వాత తెలుస్తాయి.

క్రమంగా ఈ ఫార్ములా రొటీన్ అవుతోందన్న వాస్తవాన్ని దర్శకులు గుర్తించడం లేదు. డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా హీరోలు వాటిని ఎంత బలంగా చెప్పినా ఏళ్ళ తరబడి ఒకే ఫార్మాట్ ని పదే పదే రిపీట్ చేయడమనేది మంచి ఫలితాలను ఇవ్వదు. అయినా ఇప్పుడు జనాలు సందేశాల కోసం, తమ కళ్ళు తెరిపించే కథానాయకుల కోసం థియేటర్లకు రావడం లేదు. యాక్షన్ లేదా ఎంటర్ టైన్మెంట్ లేదా కమర్షియల్ స్టార్ మసాలా. అంతే తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లిందన్నది వాస్తవం.