ఎంత మంచి పని చేశావ్ రాజమౌళీ..

రాజమౌళి బాలీవుడ్‌ను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ రోజు ఉత్తరాది ప్రేక్షకులు సౌత్ సినిమాలను నెత్తిన పెట్టుకుని హిందీ సినిమాలను తిరస్కరిస్తున్నారంటే ఆ దిశగా పునాది వేసింది జక్కన్న సినిమా బాహుబలినే. ఆ సినిమాతో నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రాజమౌళి.. హిందీ ప్రేక్షకులను వశం చేసుకున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తోనూ మరోసారి వారిని మెస్మరైజ్ చేశాడు. రాజమౌళి తన సినిమాలతో ఇచ్చే విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండియాలో ఇంకెవ్వరూ ఇవ్వలేరన్నది స్పష్టం.

అప్పటికే మగధీర, ఈగ సినిమాలతో విజువల్ ఎఫెక్ట్స్‌ మీద పట్టు సాధించి, మన ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన జక్కన్న.. ‘బాహుబలి’తో చాలా మెట్లు ఎక్కేశాడు. వీఎఫెక్స్ అంటే ఎలా ఉండాలి అనే విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆ ప్రమాణాలను అందుకోవడం మిగతా వాళ్లకు చాలా కష్టం అయిపోతోంది.

ఒకప్పుడు ఎఫెక్ట్స్ పేరుతో ఏం చూపించినా నోరెళ్లబెట్టి చూసేవారు ప్రేక్షకులు. కానీ ‘బాహుబలి’ తర్వాత ఏదీ వారి అంచనాలను అందుకోవడం లేదు. అది మిగతా చిత్రాలకు శాపంగా మారుతోంది. ఇప్పుడు హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూసి అందరూ పెదవి విరుస్తుండటానికి పరోక్షంగా ‘బాహుబలి’నే కారణం. అందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చూసి.. ఇవి చూసేసరికి సాధారణంగా అనిపిస్తున్నాయి. వీఎఫెక్స్ మీద గతంలో ఏ కామెంట్లు చేయని వాళ్లంతా కూడా ఇప్పుడు బిలో పార్ అనే మాటను వాడుతున్నారు.

జక్కన్నలా విజువల్ ఎఫెక్స్ట్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వడం వేరే వాళ్లకు సాధ్యం కావట్లేదన్నది స్పష్టం. ఆ విజన్ అందరికీ ఉండదు. ప్రపంచస్థాయి వీఎఫెక్స్ నిపుణులతో హైర్ చేసుకోవచ్చేమో కానీ.. వారికి చెప్పి పని చేయించుకోవడం, ఔట్ పుట్ తీసుకోవడం అన్నది తేలికైన విషయం కాదు. అందులో మాస్టర్ అయిన జక్కన్న మిగతా డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు.