పవన్ ఇప్పుడైనా క్లారిటీ ఇస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం కొన్నేళ్ల నుంచి సందిగ్ధత మధ్యే సాగుతోంది. ఆయన ఎప్పుడు సినిమాలు చేస్తాడో.. ఎప్పుడు గ్యాప్ తీసుకుంటాడో.. ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో తెలియని అయోమయం. ఇందుకు రాజకీయాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశలో సినిమాలు చేయబోనని ప్రకటించిన పవన్.. రెండేళ్ల కిందట ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పున:ప్రారంభించడం.. గత ఏడాది ఈ చిత్రం రిలీజవడం తెలిసిందే.

ఈ సినిమా చేస్తున్నపుడే పవన్ నుంచి వరుసగా అనౌన్స్‌మెంట్లు వచ్చాయి కానీ.. వాటిలో ఏ సినిమా ఎప్పుడు ముందుకు కదలుతుందో తెలియని అయోమయమే నడిచింది. ముందు ప్రకటించిన సినిమాలు కాకుండా ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాగా.. ‘హరిహర వీరమల్లు’ విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సంగతేంటో తేలట్లేదు.

తన చివరి సినిమా రిలీజై మూడేళ్లు కావస్తున్నా.. హరీష్ శంకర్ ఈ సినిమా మీద ఆశలతో వేరే ప్రాజెక్టును ముట్టుకోలేదు. స్క్రిప్టు రెడీ చేసుకుని, కాస్టింగ్ సెట్ చేసుకుని సిద్ధంగా ఉన్నా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించాల్సి ఉంది. వాళ్ల దగ్గర్నుంచి చాలా ఏళ్ల కిందట పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టు విషయంలో అభిమానులు కూడా ఎదురు చూసి చూసి అలసిపోయారు. ఈ మధ్య ఈ సిినిమా గురించి వరుసగా నెగెటివ్ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తానంటూ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని, ఈ సినిమాను ఇంకా వెనక్కి నెట్టి పవన్ ఓ తమిళ రీమేక్‌ను తెరపైకి తెచ్చాడని.. ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రీ వాళ్లు తమ కొత్త చిత్రం ‘అంటే సుందరానికీ’ పవన్‌ను ముఖ్య అతిథిగా తీసుకురావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గురువారం జరగనున్న ఈ వేడుకలో పవన్ నుంచి ‘భవదీయుడు భగత్ సింగ్’ విషయంలో ఒక క్లారిటీ రావచ్చని, ఆయన్ని కమిట్ చేయించడానికే మైత్రీ వాళ్లు ఈ వేడుకకు రప్పిస్తున్నారని అంటున్నారు. మరి పవన్ ఈ ప్రాజెక్టు విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.