రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ సినిమాల‌పై మ‌హేష్ కామెంట్!

భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా వ‌రుస‌గా మూడేళ్ల‌లో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. ఇప్పుడు అత‌డి నుంచి వ‌స్తున్న సర్కారు వారి పాట కూడా క‌చ్చితంగా పెద్ద హిట్ట‌వుతుంద‌నే అంచ‌నాలున్నాయి. దీని త‌ర్వాత మ‌హేష్ లైన‌ప్ మామూలుగా లేదు. మ‌ళ్లీ అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో మ‌హేష్ జ‌ట్టు క‌డుతున్నాడు. వీరి క‌ల‌యిక‌లో అత‌డు లాంటి క్లాసిక్ వ‌చ్చింది.

త‌ర్వాతి చిత్రం ఖ‌లేజా ఫ్లాప్ అయినా అది కూడా క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంది. దీని త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టుల గురించి అభిమానుల్లో చాన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఐతే ఈ సినిమాల గురించి మ‌హేష్ ఏమ‌నుకుంటున్నాడ‌న్నది ఆస‌క్తిక‌రం. స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన అత‌ను.. ఆ రెండు చిత్రాల‌పై ఏమ‌న్నాడంటే..?

త్రివిక్ర‌మ్ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడితే తొంద‌ర‌పాట‌వుతుంది. కానీ మా కాంబినేష‌న్లో సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నేను కూడా చాలా ఎగ్జైట్ అవుతాను. ఆయ‌న డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. వాటిని వింటున్న‌పుడు, సెట్లో చెబుతున్న‌పుడు వేరే ఫీలింగ్ ఉంటుంది. మేమిద్ద‌రం క‌థ గురించి, ఏదైనా స‌న్నివేశం గురించి మాట్లాడుకున్నపుడు ఒక సంతృప్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెడ‌దామా అని ఎదురు చూస్తున్నా. ఆ సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది.

ఇక రాజ‌మౌళి సినిమా విష‌యానికి వ‌స్తే.. మా నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, ఈ ప్రాజెక్టు ఎలా ఉంటుంద‌ని ఊహిస్తారో అందుకు త‌గ్గ‌ట్లే ఉంటుంది. రాజ‌మౌళితో ఒక‌ సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసిన అనుభ‌వం వ‌స్తుంది. కాబ‌ట్టి ఆల‌స్య‌మైనా స‌రే.. ఆయ‌న స్థాయికి త‌గ్గ సినిమానే చేయాల‌నుకుంటున్నాం అని మ‌హేష్ వివ‌రించాడు.