‘ఆచార్య’ కాపీ గొడవ సంగతేంటి?

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ టీజర్ విడుదలైన దగ్గర్నుంచి ఒక వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ తనదని, కొరటాల శివ దాన్ని కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నాడని రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపించడం అప్పట్లో దుమారం రేపింది. ఈ విషయంలో అతనేమీ ఆషామాషీగా ఏమీ ఆరోపణలు చేయలేదు.

తాను ఒక కథ రాసుకుని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ వారిని కలిసి ఈ కథ చెప్పానని.. వాళ్లు కొరటాల శివ లాంటి పెద్ద దర్శకుడు ఈ కథను డైరెక్ట్ చేస్తే బాగుంటందని అభిప్రాయపడ్డారని.. కథ అడిగితే తాను ఇవ్వనన్నానని.. తర్వాత తన కథనే కొరటాల కాపీ కొట్టి చిరంజీవితో ‘ఆచార్య’ తీశాడని ఆరోపించాడు. ‘ఆచార్య’  చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరు రెండు కథలూ ఒకటే అని కన్ఫమ్ చేశారని కూడా రాజేష్ పేర్కొన్నాడు.

దీని మీద కొరటాల సైతం టీవీ ఛానెళ్ల డిబేట్లలో పాల్గొన్నాడు. రాజేష్ కథకు తన స్టోరీకి సంబంధం లేదని వాదించాడు. తనది పెద్ద సినిమా కావడంతో కథను ఇప్పుడు బయటపెట్టలేనని.. రేప్పొద్దున సినిమా చూశాక తన కథ వేరని ఆరోపణలు చేసిన వ్యక్తికే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నాడు. కాగా ఈ వివాదం మీద కొన్ని వారాల కిందట కూడా రాజేష్ ఒక యూబ్యూట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంతకుముందు చేసిన ఆరోపణలనే కొనసాగించాడు.దీంతో ‘ఆచార్య’ రిలీజైతే ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుందని అందరూ ఎదురు చూశారు. మొత్తానికి సినిమా రిలీజైంది. ‘ఆచార్య’ కథేంటో తెలిసిపోయింది.

ఇప్పుడు రాజేష్‌కు కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. తన కథనే కాపీ కొట్టి కొరటాల సినిమా చేసి ఉంటే.. అతను ఇప్పుడు పాయింట్ పట్టుకుని మాట్లాడొచ్చు. అతడి కథ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయింది కాబట్టి రచయితల సంఘానికి కూడా ఒక స్పష్టత వస్తుందిప్పుడు. మరి రాజేష్ ఇప్పుడెలా స్పందిస్తాడు.. తన ఆరోపణలకు కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం. ఐతే ఈ సంగతి పక్కన పెడితే.. ‘ఆచార్య’కు నెగెటివ్ టాక్ రావడం, కథ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటం పట్ల రాజేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.