మణిరత్నం మూవీ.. విడుదలకు ముందే రూ.125 కోట్లు

పొన్నియన్ సెల్వన్.. తమిళ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలిం. కోలీవుడ్ ఆల్ టైం లెజెండరీ డైరెక్టర్లలో ఒకడైన మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది ఆయన కలల ప్రాజెక్టు. దాదాపు 20 ఏళ్ల ముందే ఆయనకు ఈ సినిమా తీయాలన్న ఆలోచన పుట్టింది. కల్కి కృష్ణమూర్తి అనే రచయిత ‘పొన్నియన్ సెల్వన్’ పేరుతోనే రాసిన ఓ కల్ట్ నావెల్ ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథ రెండు భాగాలుగా రానుండగా.. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రేక్షకులను పలకరించనుంది.

ఐతే తొలి భాగం విడుదల కావడానికి ఆరు నెలల సమయం ఉండగా.. సెకండ్ పార్ట్‌తో కలిపి ఈ చిత్రానికి డిజిటల్ డీల్ పూర్తి కావడం విశేషం. స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్.. పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు భాగాలకు కలిపి ప్రైమ్ వాళ్లు రూ.125 కోట్లు చెల్లిస్తున్నారట. తమిళంలో ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాహుబలి తరహా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. కాస్టింగ్ పరంగా ఇండియాలోనే ఇదే బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. బాహుబ‌లికి దీటైన భారీ చిత్రం తీయాల‌ని అక్క‌డ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతూ వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా ఏ సినిమా కూడా దాని ద‌రిదాపుల్లోకి రాలేదు. విక్ర‌మ్, ఐశ్వ‌ర్యారాయ్, కార్తి, త్రిష‌, జ‌యం ర‌వి, శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, విక్రమ్ ప్రభు, శోభిత దూళిపాళ్ల.. ఇలా భారీ తారాగ‌ణం ఉందీ చిత్రంలో. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్‌తో కలిసి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

డిజిటల్ హక్కులతోనే రూ.125 కోట్లు వచ్చాయంటే రెండు భాగాలకు కలిపి ఓవరాల్ బిజినెస్ రూ.1000 కోట్ల దాకా జరిగినా ఆశ్చర్యం లేదు. ఐతే మణిరత్నంలో మునుపటి టచ్ అయితే ఇప్పుడు లేదు. పైగా ఇలాంటి భారీ చిత్రాన్ని ఆయన రాజమౌళిలా సగటు ప్రేక్షకులకు, మాస్‌కు మెచ్చేలా తీర్చిదిద్దగలడా అన్న ప్రశ్న కూడా ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.