చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా.. కీల‌క మార్పు?

ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చ‌ర‌ణ్ ఇమేజే మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ ఇమేజ్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకునేలా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడ‌త‌ను. దిల్ రాజు నిర్మాణంలో దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌టం విశేషం. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి అగ్ర శ్రేణి సినిమాటోగ్రాఫ‌ర్ తిరుణావుక‌ర‌సు అలియాస్ తిరును తీసుకున్నాడు శంక‌ర్.

ఆయ‌న హిందీలో క్రిష్-2..  త‌మిళంలో 24.. మ‌ల‌యాళంలో మ‌ర‌క్కార్.. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను, ఆచార్య లాంటి భారీ చిత్రాల‌కు ప‌ని చేశాడు. జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఐతే కార‌ణాలేంటో తెలియ‌దు కానీ.. చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా నుంచి మ‌ధ్య‌లో తిరు త‌ప్పుకున్నార‌ట‌.
వ‌రుస‌గా నాలుగు షెడ్యూళ్లు తిరు ఛాయాగ్ర‌హ‌ణంలోనే పూర్త‌య్యాయి.

కానీ త‌ర్వాతి షెడ్యూల్‌కు ఆయ‌న దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అమృత్ స‌ర్, దాని ప‌రిస‌రాల్లో జ‌రిగిన షెడ్యూల్‌కు తిరు రాలేద‌ని తెలిసింది. శంక‌ర్ బిగ్గెస్ట్ ఫిలిం రోబో, అలాగే ఆయ‌న మ‌ధ్య‌లో వ‌దిలేసిన ఇండియ‌న్-2 చిత్రాల‌కు ర‌త్న‌వేలునే సినిమాటోగ్రాఫ‌ర్‌. శంక‌ర్‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. తిరు శంక‌ర్ సినిమాకు ప‌ని చేస్తున్న‌ది ఇప్పుడే.

మ‌రి ఇద్ద‌రికీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఏమైనా వ‌చ్చాయో ఏమో తెలియ‌దు కానీ.. కొత్త షెడ్యూల్‌కు తిరు దూర‌మ‌య్యారు. మ‌రి ఏవైనా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ షెడ్యూల్‌కు తిరు అందుబాటులో లేడా.. కొత్త షెడ్యూల్‌కు ఆయన తిరిగొస్తారా లేక ర‌త్న‌వేలునే కొన‌సాగుతాడా అన్నది స్ప‌ష్ట‌త లేదు. త్వ‌ర‌లోనే దీని గురించి ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్న సంగ‌తి తెలిసిందే.