చరణ్ మరిచిపోలేని 18 రోజులు

మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చరణ్.. తన తండ్రితో కలిసి నటించిన అరుదైన అనుభవం గురించి మాట్లాడాడు. కొన్నేళ్ల నుంచి ఒకే ఇంట్లో కలిసి లేకపోవడం వల్ల తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని.. ఐతే ‘ఆచార్య’ కారణంగా ఇద్దరం చాలా కాలం తర్వాత ఒకే ఇంట్లో వరుసగా 18 రోజులు ఉన్నామని.. ఆ 18 రోజులు తనకు మరపురానివని చరణ్ వెల్లడించాడు. 

దీని గురించి చరణ్ మరింత వివరిస్తూ.. ‘‘ఇంటి నిర్మాణ పనుల వల్ల గత నాలుగేళ్లుగా నేను, నాన్న దూరంగా ఉంటున్నాం. వీకెండ్స్‌లో, అప్పుడప్పుడూ కలుస్తుంటాం కానీ.. ఇంతకుముందులా ఒకే చోట కలిసి లేమన్న వెలితి ఉండేది. ఇలాంటి సమయంలో ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం నేను, నాన్న మాత్రమే ఒకే కాటేజీలో 18 రోజులు ఉండే అవకాశం వచ్చింది. అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశం కోసం మేమిద్దరం ఒక కాటేజీలో ఉన్నాం.

అప్పుడు రోజూ ఇద్దరం ఒకేసారి నిద్ర లేవడం.. వర్కవుట్లు చేయడం.. బ్రేక్ ఫాస్ట్ చేయడం.. షూటింగ్‌కు వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి కాటేజీకి రావడం కబుర్లు చెప్పుకుని, భోజనం చేసి పడుకోవడం.. ఇలా 18 రోజులు ఒకేలా సాగాయి. ఆ మధుర క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను.

మధ్యలో నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చి.. ‘చరణ్.. పనిలో బిజీగా ఉండడం వల్ల మనిద్దరం ఇలా కలిసి ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు. నేను కూడా నీకోసం ఇంత సమయాన్ని మళ్లీ ఎప్పుడు కేటాయించగలనో తెలియదు. ఆచార్య వల్ల మనకీ అవకాశం వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేద్దాం’ అని చెప్పారు. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను సరే అని చెప్పా. అనుకున్నట్లే ఆ 18 రోజుల్ని మేం చాలా ఎంజాయ్ చేశాం’’ అని చరణ్ వివరించాడు.