మిస్ ఇండియా బరిలో హీరో కుమార్తె

మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ కాస్తంత డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. ప్రముఖ హీరోలు.. వారి కుటుంబాలకు చెందిన అబ్బాయిలు తమ నట వారసులుగా వెండి తెరను ఏలే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో.. వారి అమ్మాయిలు మాత్రం సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకుంటామంటే బోలెడన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి.

ఇందుకు భిన్నంగా ఒక ప్రముఖ హీరో కుమార్తె గ్లామర్ రంగంలోకి తీసుకురావటమే కాదు.. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో ఆమెను పరిచయం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని ఇప్పటికే హీరోయిన్ గా తానేమిటో ఫ్రూవ్ చేసుకుంది. గత ఏడాది అద్భుతం మూవీతో పరిచయమైన ఆమె ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టుల్ని చేస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. తన సోషల్ మీడియా ఖాతాలో శివానీ పెట్టిన పోస్టును చూస్తే.. తాను మిస్ ఇండియా ఆడిషన్ లో పాల్గొన్నట్లుగా పేర్కొంది. అంతేకాదు.. తాను కొత్త జర్నీని షురూ చేసినట్లుగా చెబుతూ.. అందరి ఆశీర్వాదాలను కోరింది.

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ఇతర రాష్ట్రాల నుంచి బరిలోకి దిగిన వారందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన శివానీ.. ఈ అందాల పోటీలో ఏ రీతిలో రాణిస్తుందో చూడాలి. ఏమైనా..ఒక ప్రముఖ హీరో కుమార్తె గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టటమే తక్కువ. అలాంటిది మిస్ ఇండియా బరిలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. ఆమె కోరుకున్నట్లే టైటిల్ సొంతం చేసుకుంటుందా? లేదా? అన్నది మరికొంత కాలంలో తేలిపోనుంది.