‘ఆచార్య‌’లో ఏమైనా దాచారా?


‘భీమ్లానాయక్’ ఉన్నంతలో బాగానే అలరించింది. ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. మొత్తానికి కొత్త ఏడాదిలో మూడు భారీ చిత్రాల కథ ముగిసింది. ఇక తర్వాత టాలీవుడ్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పెద్ద సినిమా అంటే ‘ఆచార్య’నే. ఈ నెల 29న ఈ మెగా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర.. రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర.. కథానాయికలుగా కాజల్, పూజా హెగ్డే.. ఇప్పటిదాకా తీసిన నాలుగు చిత్రాలతోనూ బ్లాక్‌బస్టర్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వం.. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? ఐతే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం అనుకున్నంత గొప్పగా అయితే లేదు. చిరు, చరణ్ ఇద్దరూ అభిమానులను బాగానే ఆకట్టుకున్నా.. కథ పరంగా చూస్తే ట్రైలర్ కొత్తగా ఆఫర్ చేసిన అంశాలేమీ లేవు.

‘ఆచార్య’ ట్రైలర్ చూస్తే ఇప్పటిదాకా తెలుగు తెరపై ఎన్నోసార్లు చూసిన కథనే మళ్లీ రీహ్యాష్ చేసినట్లు కనిపించింది. ప్రశాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో విలన్లు అరాచకాలు సృష్టించడం.. తమను కాపాడేదెవరని ఎదురు చూస్తున్న సమయంలో ఒక రక్షకుడు రావడం.. తర్వాత హీరోకు, విలన్లకు మధ్య పోరు.. ఇలా ఒక ఫ్లాట్ లైన్ కనిపిస్తోంది ‘ఆచార్య’లో. నిజానికి ఇలాంటి రొటీన్ కథలు బోయపాటి శ్రీను సినిమాల్లో కనిపిస్తుంటాయి. కొరటాల ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో అతణ్ని అనుసరించాడా అనిపిస్తోంది. బోయపాటి సినిమాల్లో మాదిరే విపరీతమైన హింస కనిపించింది ట్రైలర్లో. సినిమాలో ముందుగా ధర్మస్థలికి రక్షకుడిగా చరణ్ ఉంటే.. అతడి పాత్ర ముగిశాక చిరు వచ్చి ఛార్జ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు వీళ్లిద్దరూ కలిసి ఫ్లాష్ బ్యాక్‌లో నక్సలైట్లుగా ఒక ఎపిసోడ్ చూపించినట్లున్నారు.

ఇలా కథ పరంగా చూస్తే కొత్తగా కానీ, ఎగ్జైటింగ్‌గా కానీ ఏమీ కనిపించలేదు. న్యూట్రల్ ఆడియన్స్ ట్రైలర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇదే కారణం. ఐతే చిరు, చరణ్‌ల కలయికలో సినిమా చేసే ఛాన్స్ వచ్చినపుడు కొరటాల ఆషామాషీ సినిమా తీసి ఉండడని.. బాగా టైం తీసుకుని చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా ఏవో కొన్ని సర్ప్రైజులను దాచి ఉంటాడని.. కథ రొటీన్ అనిపించినా.. కథనంతో మ్యాజిక్ చేసి ఉంటాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి కొరటాల ఏమేర వారి ఆశల్ని నెరవేరుస్తాడో చూడాలి.