ఒకే రోజు 30 ప్రాణాలు నిలిపిన మ‌హేష్‌

వెండితెర‌పై శ్రీమంతుడి పాత్ర‌లో త‌న‌దైన ముద్ర వేశాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ఆ సినిమా ప్ర‌భావ‌మో ఏమో కానీ.. నిజ జీవితంలోనూ ఆయ‌న శ్రీమంతుడి త‌ర‌హాలోనే సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ అంద‌రి మ‌న‌సులు గెలుస్తున్నాడు. శ్రీమంతుడు కాన్సెప్ట్‌ను నిజ జీవితానికి కూడా అన్వ‌యించి ఆంధ్రా, తెలంగాణ‌ల్లో రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి కోసం కోట్ల రూపాయ‌లు మ‌హేష్ ఖ‌ర్చు చేయ‌డం తెలిసిందే.

ఇదంతా ఒకెత్త‌యితే చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధ ప‌డే చిన్న పిల్ల‌లకు శ‌స్త్ర‌చికిత్సలు చేయిస్తూ వారి ఇళ్ల‌లో వెలుగులు నింపుతున్నాడు మ‌హేష్. ఇలా ప‌ది మందికో, 20 మందికో, లేక వంద మందికో కాదు.. ఇప్ప‌టిదాకా వెయ్యి మందికి పైగా చిన్నారుల‌కు శ‌స్త్ర‌చికిత్స‌లు చేయించి వారి ప్రాణాలు నిలిపిన ఘ‌న‌త మ‌హేష్‌కు చెందుతుంది.

ఇప్పుడు ఈ సేవ‌ను మ‌హేష్ మ‌రో స్థాయికి తీసుకెళ్తున్న‌ట్లే కనిపిస్తోంది. ఒక్క రోజులో మ‌హేష్ తోడ్పాటుతో 30 మంది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్లు జ‌ర‌గ‌డం విశేషం. ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఆంధ్రా హాస్పిట‌ల్లో మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ సాయంతో 30 మంది పిల్ల‌ల‌కు గుండె శ‌స్త్ర‌చికిత్స‌లు జ‌రిగాయి. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ వెల్ల‌డించింది.

సోష‌ల్ మీడియాలో ఈ పోస్టు వైర‌ల్ అయింది. మ‌హేష్ గొప్ప మ‌న‌సును అంద‌రూ కొనియాడుతున్నారు. అత‌ను నిజ జీవిత శ్రీమంతుడని కీర్తిస్తున్నారు. త‌న కొడుకు పుట్టిన‌పుడు చాలా త‌క్కువ బ‌రువుతో ఉన్నాడ‌ని.. అప్పుడు ఎంతో ఖ‌ర్చు పెట్టుకుంటే మామూలు స్థితికి వ‌చ్చాడ‌ని, మ‌రి పేద‌లకు ఇలాంటి క‌ష్టం వ‌స్తే ఎలా అని ఆలోచించి అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్ల‌ల‌కు ఇలా తోడ్పాటు అందించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఇటీవ‌ల బాల‌య్య నిర్వ‌హించిన అన్ స్టాప‌బుల్ షోలో మ‌హేష్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.