వరుణ్ తేజ్ అంత కష్టంలోనూ..

యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతడి మార్కెట్ స్థాయికి మించి, కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘గని’ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడేళ్ల ముందు ఈ సినిమా మొదలుపెడితే.. కరోనా, ఇతర కారణాలతో బాగా ఆలస్యమై ఎట్టకేలకు రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాను కొన్ని రోజుల నుంచి అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు వరుణ్. ఎండలు మండిపోతుండగా.. వైజాగ్ సహా పలుచోట్ల తిరిగిన అతను డీహైడ్రేషన్‌కు గురయ్యాడట. జ్వరం కూడా వచ్చిందట.

బుధవారం వరుణ్ ఇంటి నుంచి కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అదే రోజు హైదరాబాద్‌లో రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ ఏదీ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే బాగుండదు. అందుకే విడుదలకు రెండు రోజుల ముందు ఈ ఈవెంట్ పెట్టారు. ఆరోగ్యం సహకరించకున్నా వరుణ్ కష్టపడి ఈ ఈవెంట్‌కు వచ్చాడు.

డీహైడ్రేషన్ నేపథ్యంలో వదులుగా ఉన్న చొక్కా వేసుకుని సగం వరకు బొత్తాలు విప్పి కనిపించాడు వరుణ్. విపరీతంగా చెమటలు పడుతూ ఇబ్బంది పడ్డాడు. అయినా ఈ ఈవెంట్ అయ్యేదాకా ఉండి వెళ్లాడు. ఇక తన ప్రసంగంలో అతను దర్శకుడు, నిర్మాతల గురించి గొప్పగా చెప్పాడు. దర్శకుడు కిరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందీ, ఉపేంద్ర ఈ సినిమా చేయడేమో అని తాను అంటే ఆయన కాళ్లు పట్టుకుని అయినా ఒప్పిస్తా అని చెప్పి మరీ ఆయనతో ఎలా ఓకే చేయించుకుని వచ్చింది వివరించాడు.

ఇక నిర్మాతల్లో ఒకరైన సిద్ధు ముద్ద తనతో సినిమా చేయడం కోసం ఉద్యోగం వదులుకుని వచ్చాడని, మరో నిర్మాత అల్లు బాబీ తన తండ్రికి చెందిన నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌజ్ పెట్టి ఈ సినిమా చేశాడని తెలిపాడు వరుణ్. తన బాబాయి పవన్ కళ్యాణ్ బాక్సర్‌గా నటించిన ‘తమ్ముడు’ సినిమా ప్రభావం తన మీద, ఈ సినిమా మీద కొంతమేర ఉంటుందని వరుణ్ చెప్పాడు.