ఎన్టీఆర్ ఎవరన్నాడు.. గోపీతో చేస్తున్నాడు

తమిళంలో ఊర మాస్ డైరెక్టర్లలో హరి ఒకడు. సింగం సిరీస్ సినిమాలతో అతడి శైలి ఏంటో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. వీటి కంటే ముందు సామి సహా కొన్ని భారీ విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. హరి లాంటి దర్శకుడు తెలుగులో మాస్ హీరోలతో సినిమాలు చేస్తే బాగా వర్కవుట్ అవతుందనే అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో హరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా వాళ్లు ఓ సందర్భంలో అడిగితే.. హరి చిరాకు పడ్డాడు.

ఎన్టీఆర్ ఎవరసలు అని ప్రశ్నించాడు. అంటే ఎన్టీఆర్ అతడికి తెలియదని కాదు కానీ.. ఏదో రూమర్‌ను పట్టుకుని తనను తారక్‌తో సినిమా గురించి అడిగేసరికి అసహనానికి గురైనట్లున్నాడు హరి. ఐతే అతను ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో కానీ.. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్‌తో హర్టయ్యారు. కట్ చేస్తే తారక్‌తోనే కాదు.. మరే తెలుగు హీరోతోనూ ఇప్పటిదాకా హరి సినిమా చేయలేదు. ఐతే ఇప్పుడు హరి టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఒకప్పటితో పోలిస్తే హరి ఇప్పుడేమంత ఫాంలో లేడు. సింగం సిరీస్‌లో చివరి సినిమా సింగం-3 సరిగా ఆడలేదు. ఆ తర్వాత సామి సీక్వెల్ చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు అరుణ్ విజయ్ హీరోగా యానై (తెలుగులో ఏనుగు) అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే.. తెలుగులో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గోపీ కోసం తనదైన శైలిలో ఒక మాస్ కథ రెడీ చేశాడని.. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని, సినిమా దాదాపు ఓకే అయినట్లే అని అంటున్నారు.

ఈ చిత్రానికి నిర్మాతను కూడా గోపీచందే సెట్ చేస్తున్నాడట. ఐతే హరి మాత్రమే కాదు.. ఇప్పుడు గోపీ కూడా ఫాంలో లేడు. ‘లౌక్యం’ తర్వాత అతడికి సక్సెస్ లేదు. త్వరలోనే ‘పక్కా కమర్షియల్’తో పలకరించనున్న అతను.. శ్రీవాస్‌తో ‘లక్ష్యం-2’ చేస్తున్నాడు. ఇవి రెండూ బాగా ఆడితే తప్ప హరితో చేసే సినిమాకు క్రేజ్ రావడం కష్టమే.