ఉదయ్ కిరణ్ చివరి సినిమాను రిలీజ్ చేస్తే…?

ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే దాన్ని థియేటర్లలోకి తీసుకురావడమే సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో లాక్ డౌన్ వచ్చి పదుల సంఖ్యలో సినిమాలు పెండింగ్‌లో పడిపోయే పరిస్థితి తెచ్చింది. దీంతో మున్ముందు థియేట్రికల్ రిలీజ్ మరింత కష్టమయ్యేలా ఉంది. మళ్లీ మామూలుగా సినిమాలు నడిచే సమయానికి చిన్న, మీడియం రేంజ్ సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయడం సవాలుగా మారబోతోంది.

ఈ నేపథ్యంలో కొందరు ఓటీటీల్లో నేరుగా తమ సినిమాలు రిలీజ్ చేసే సాహసానికి దిగుతున్నారు. అలాగే చాలా కాలం మరుగున పడి ఉన్న సినిమాల్ని కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసి ఓ పనైపోయింది అనిపించుకోవడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. గోపీచంద్ సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ కూడా ఈ కోవలోనే రిలీజ్ కాబోతోంది. సందీప్ కిషన్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘డీకే బోస్’ను కూడా ఇలాగే ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

ఈ వరుసలో మరికొన్ని పాత సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చే అవకాశముంది. నామమాత్రపు రేటుతో వాటిని రిలీజ్ చేసుకునే అవకాశముంది. అసలు రిలీజే కావనుకున్న సినిమాలు ఎంతో కొంత రేటుతో ఇలా రిలీజయ్యినా మంచిదే కదా. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ను కూడా ఇలా రిలీజ్ చేసేస్తే బాగుంటుందని అతడి అభిమానులు ఆశపడుతున్నారు.

ఉదయ్ మీద జనాల్లో ఎంత అభిమానం ఉన్నది ఎవరైనా సినీ సెలబ్రెటీ చనిపోయినపుడు తెలుస్తుంటుంది. అప్పుడు అతణ్ని గుర్తు చేసుకుని బాధ పడుతుంటారు ఫ్యాన్స్. అతడి జయంతి, వర్ధంతి సందర్భాల్లోనూ సోషల్ మీడియాలో అభిమానుల బాధ తెలుస్తుంటుంది. ‘చిత్రం చెప్పిన కథ’ను ఉదయ్ మరణానంతరం రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఆ సినిమాను రిలీజ్ చేస్తే అభిమానులు చాలా సంతోషిస్తారనడంలో సందేహం లేదు.