ఆ హీరోకు వంద కోట్ల పారితోషకం?

తమిళంలో ఒకప్పుడు ఏ రికార్డయినా సూపర్ స్టార్ రజినీకాంత్ మీదే ఉండేది. పారితోషకంలో అయినా.. సినిమాల బిజినెస్, వసూళ్ల విషయంలో అయినా ఆయనదే ఆధిపత్యం. మిగతా స్టార్లకు, ఆయనకు మధ్య చాలా అంతరం ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వేగంగా పరిస్థితులు మారిపోయాయి. రజినీ వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. అదే సమయంలో విజయ్, అజిత్ దూసుకెళ్లిపోయారు.

వీళ్లిద్దరిలో కాస్త పైచేయి విజయ్‌దే అని చెప్పాలి. కానీ అజిత్ కూడా తక్కువ వాడేమీ కాదు. ‘విశ్వాసం’ లాంటి మామూలు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన ఘనత అజిత్ సొంతం. తాజాగా అజిత్ ‘వలిమై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మామూలు సినిమానే. డివైడ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి సినిమాతో వసూళ్ల మోత మోగించి తన స్టార్ డమ్‌కు తిరుగులేదని చాటాడు అజిత్.

ఆ చిత్రం దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అక్కడి ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.‘వలిమై’ రిలీజైన టైంలోనే ఆ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్‌తో మరో సినిమాను మొదలుపెట్టేసిన అజిత్.. తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లనుంది. అందులో నయనతార కథానాయిక కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల పారితోషకాన్ని అజిత్ అందుకోనున్నాడట.

లైకా వాళ్లు రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ ఇచ్చి అజిత్‌ను ఈ సినిమాకు ఒప్పించారట. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతోనూ 200 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే ఇక ఆ హీరోకున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘వలిమై’ లాంటి సినిమా రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో రన్ అయిందంటే కేవలం అజిత్ మేనియానే కారణం. అందుకే రూ.100 కోట్ల పారితోషకం అజిత్ అందుకోవడాన్ని మరీ విడ్డూరంగా చూడాల్సిన పని లేదు.