‘కశ్మీర్ ఫైల్స్’పై ఆమిర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పది రోజుల నుంచి ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి సంచలననాలు రేపుతోందో తెలిసిందే. బాలీవుడ్లో మామూలుగా ఎక్కువ మంది ఫిలిం మేకర్స్ ముస్లిం సానుభూతి పరులుగా ఉంటారని, వారికి అనుకూలంగానే సినిమాలు తీస్తుంటారనే అభిప్రాయం ఉంది. హిందువులను, హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాలు తీస్తుంటారంటూ నార్త్ ఇండియన్సే బాలీవుడ్ మీద విరుచుకుపడుతుంటారు.

సౌత్ సినిమాల్లో హిందూ సంస్కృతిని, దేవుళ్లను గొప్పగా చూపించే వైనాన్ని కొనియాడుతుంటారు. ఐతే ఇప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ దీనికి భిన్నంగా కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ఇస్లాం ఛాందసవాదులు జరిపిన  అఘాయిత్యాల మీద హార్డ్ హిట్టింగ్ కథాకథనాలతో తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంటోంది. ఐతే ఈ సినిమా మీద బాలీవుడ్ నటీనటులు, ఫిలిం మేకర్స్ ఆచితూచి స్పందిస్తున్నారు. చాలామంది వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీని మీద కామెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు.ఇలాంటి తరుణంలో ఆమిర్ ఖాన్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ సంచలనాల గురించి మీడియా వాళ్లు అతడి వద్ద ప్రస్తావిస్తూ.. ఈ సినిమా చూశారా అని అడిగారు. దానికి బదులిస్తూ.. ‘‘పనిలో బిజీగా ఉండటం వల్ల నేనా సినిమా ఇంకా చూడలేదు. తప్పకుండా చూస్తారు. ప్రతి భారతీయుడూ ఇలాంటి సినిమాలు చూడాలి. కశ్మీర్ ఫైల్స్ మన చరిత్రకు నిదర్శనం.

ఒకానొక సమయంలో కశ్మీర్ పండిట్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విచారకరం. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా విజయవంతం అయినందుకు సంతోషిస్తున్నా’’ అని ఆమిర్ అన్నాడు. గతంలో మోడీ సర్కారు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ ఒక కామెంట్ చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఆమిర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాజపా వాళ్లు భుజానికి ఎత్తుకున్న, ఇస్లాం ఛాందసవాదానికి వ్యతిరేకంగా తెరకెక్కిన సినిమా గురించి ఆమిర్ ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.