టికెట్ల రేట్లపై ఇదేం లాజిక్ జక్కన్నా?

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి ప్రసంగం అందరినీ అమితంగా ఆకట్టుకుంది. తన హీరోలిద్దరికీ అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల సమస్య పరిష్కారానికి ఎనలేని కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా గొప్పగా మాట్లాడాడు జక్కన్న. ఐతే ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల గురించి జక్కన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

ఆల్రెడీ తెలంగాణలో టికెట్ల ధరలు పెరిగాయి. దీనికి తోడు పెద్ద సినిమాలకు తొలి రెండు వారాలు అదనంగా రేట్లు పెంచుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’కు అంతకుమించి రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దీని గురించి రాజమౌళి స్పందిస్తూ.. టికెట్ల ధరల పెంపు కోసం తాము ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినపుడు ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమాకు గర్వకారణం కాబట్టి రేట్లు పెంచుకోమని చెప్పారంటూ ఆయన్ని కొనియాడాడు జక్కన్న.ఆ తర్వాత ఏపీలో టికెట్ల ధరల ప్రస్తావన తీసుకొచ్చాడు జక్కన్న. తమ సినిమాకు రేట్లు పెంచుకోవడం కోసం అడిగితే పెద్ద మనసుతో ఏపీ సీఎం అంగీకరించారని చెప్పాడు.

ఈ సందర్భంగా ‘‘రేట్లు మరీ పెంచకుండా.. అలాగే పేదవారికి కూడా మరీ సినిమా దూరం కాకుండా ఒక బ్యాలెన్స్డ్‌గా రేట్లు ఇచ్చారు’’ అని వ్యాఖ్యానించాడు జక్కన్న. ఇక్కడ టికెట్ల ధరల విషయంలో ఏపీ సీఎం సమతూకంతో వ్యవహరించారన్న జక్కన్న అభిప్రాయం చర్చనీయాంశం. ఏపీలో టికెట్ల ధరలు మరీ పెరగకుండా, పేదలకు సినిమా దూరం కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించారని కొనియాడుతున్నపుడు.. తెలంగాణ అసాధారణంగా పెంచేసిన రేట్ల సంగతేంటి? ఆల్రెడీ సాధారణ స్థాయిలో పెంచిన రేట్లతో సౌత్ ఇండియాలోనే అత్యధిక ధరలు తెలంగాణలో ఉన్నాయి. దీనికి తోడు పెద్ద సినిమాలకు ఇంకా రేట్లు పెరుగుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’కు అయితే దాన్ని మించి ఇంకా ధరలు పెంచి పడేశారు. దీని పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాగైతే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడమే మానేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వయంగా రాజమౌళే ఏపీలో టికెట్ల ధరల విషయంలో బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించారని అన్నపుడు.. తెలంగాణలో రేట్లు మరీ ఎక్కువ ఉన్నాయని ఒప్పుకున్నట్లే కదా? ఏపీ సీఎం పేదల గురించి ఆలోచించారని అన్నపుడు.. మరి తెలంగాణలో పేదలు లేరా? ఇక్కడందరూ 400 రూపాయలు పెట్టి సినిమా చూసేంత ధనికులేనా అన్నది ప్రశ్న.