మహేష్ మూవీ.. మల్టీస్టారర్ కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ అతి త్వరలోనే సాక్ష్యాత్కారం కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ ఎట్టకేలకు జత కట్టబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. సీనియర్ నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలా కాలం అయినా.. మహేష్, రాజమౌళిలకు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల మధ్యలో ఏ అప్ డేట్ రాలేదు.

ఒక సినిమా చేస్తుండగా జక్కన్న ఇంకో సినిమా గురించి ఆలోచించడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయనతో పాటు మహేష్ బాబు కూడా సైలెంటుగా ఉన్న టైంలో ఈ మధ్య ఈ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికర రూమర్ హల్‌చల్ చేసింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా నటించబోతున్నాడని, ఆయన పాత్ర ఎక్స్‌టెండెడ్ క్యామియోలా ఉంటుందని, కాబట్టి ఇది మల్టీస్టారర్‌గా చెప్పొచ్చని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఐతే చిత్ర బృందం నుంచి ఈ వార్త గురించి ఎవరూ ఏమీ స్పందించలేదు.

దీంతో ఈ ప్రచారం నిజమేనేమో అని కొందరు అభిమానులు నమ్ముతున్నారు. ఐతే రాజమౌళి ఎట్టకేలకు దీని గురించి క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు బెంగళూరుకు చేరుకున్న జక్కన్న.. అక్కడి లోకల్ మీడియాతో మాట్లాడాడు. మరి మహేష్ సినిమాలో బాలయ్య నటించబోతుండటం నిజమేనా, ఇది మల్టీస్టారరా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని తేల్చేశాడు జక్కన్న.

ఈ చిత్రంలో మహేషే హీరో అని, ఇంకే స్టార్ హీరో కూడా నటించడని, ఇది మల్టీస్టారర్ కాదని తేల్చిచెప్పాడాయన. దీంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది. పుష్కర కాలం కిందటే రాజమౌళితో మహేష్ సినిమా కోసం సన్నాహాలు జరిగాయి. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ వారి కలయిక సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌తో జట్టు కట్టబోతున్నాడు జక్కన్న. ఇది ఆఫ్రికా నేపథ్యంలో నడిచే అడ్వెంచర్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది.