టాలీవుడ్ లో విషాదం.. గేయ రచయిత మృతి

టాలీవుడ్ లో ప్రముఖ సినీ గేయ రచయిత, కవి కందికొండ యాద‌గిరి (49) కన్నుమూశారు. హైద‌రాబాద్‌లోని వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పాటు వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కందికొండ ఆరోగ్య పరిస్థితి విషయమించి శనివారం సాయంత్రం మృతి చెందారు. క్యాన్సర్ మహమ్మారితో రెండేళ్లు పోరాడిన కందికొండ..ప్రస్తుతం పెరాలసిస్ కు చికిత్స తీసుకుంటున్నారు.

క్యాన్సర్ చికిత్సలో భాగంగా చాలాకాలం కీమో థెరపీ చేయించుకోవడంతో కందికొండ స్పైనల్‌కార్డ్‌ లోని సీ1, సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. కందికొండ అనారోగ్యం బారినపడడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన కుటుంబానికి ఇటీవల మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. కందికొండ‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున చికిత్స అందించారు.

కొద్ది రోజుల క్రితం కందికొండ ఆరోగ్యం మెరుగైన‌ట్లు క‌నిపించినా..తాజాగా మ‌రోమారు క్షీణించి శ‌నివారం తుది శ్వాస విడిచారు. కందికొండ అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. కందికొండ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌కు చెందిన కందికొండ యాద‌గిరి.. ఉస్మానియా వ‌ర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చ‌దివారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. “ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం”లో “మ‌ళ్లి కూయ‌వే గువ్వా..” పాట‌తో కందికొండ అరంగేట్రం చేశారు. తొలి పాట హిట్ కావడంతో ఆ తర్వాత ఇడియ‌ట్‌, స‌త్యం, పోకిరి, ల‌వ్‌లీ, నీది నాది ఒకే క‌థ.. త‌దిత‌ర చిత్రాల‌కు అద్భుతమైన పాట‌లు రాశారు. 20ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 1300కు పైగా పాటలు రాసిన కందికొండ…బతుకమ్మ.. తెలంగాణ జానపదాలను వెలుగులోకి తెచ్చిన వారిలో ఒకరు. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం, మట్టి మనుషుల వెతలను.. పల్లె బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టే కథకుడిగా ఆయనకు మంచి పేరుంది.