రాధేశ్యామ్.. ఎందుకు వెనక్కి తగ్గింది?

ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే రికార్డు స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలక దీటుగా ‘రాధేశ్యామ్’ రిలీజవుతుండటం విశేషం. ఈ సినిమా విజయంపై చిత్ర బృందం చాలా ధీమాగానే కనిపిస్తోంది. సినిమాకు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’కు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నట్లుగా రెండు రోజుల ముందు ప్రచారం జరిగింది. బాహుబలి-2, అర్జున్ రెడ్డి సహా కొన్ని చిత్రాలకు రిలీజ్ రోజు కంటే ముందు రోజే సెకండ్ షోల నుంచి పెయిడ్ ప్రిమియర్స్ వేయడం తెలిసిందే. ఇదే తరహాలో ‘రాధేశ్యామ్’కు కూడా ప్లానింగ్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.మధ్యలో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేసినట్లు సమాచారం.

ఆ షో చూసిన వాళ్లు సినిమా బాగుందంటూనే కమర్షియల్ సక్సెస్ మీద సందేహాలు వ్యక్తం చేశారట. సినిమాను జనాలు అర్థం చేసుకుని ఆదరించడానికి టైం పట్టొచ్చని.. పెయిడ్ ప్రిమియర్స్ వస్తే డివైడ్ టాక్ రావచ్చని.. సినిమా ఫలితంపై ప్రభావం చూపొచ్చని.. అందుకే పెయిడ్ ప్రిమియర్స్ వద్దని వారించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం పెయిడ్ ప్రిమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. ఐతే తెలంగాణలో ఐదో షోకు అనుమతి రావడం లాంఛనమే అని తెలుస్తోంది. ఉదయం 7 గంటలకే తొలి షో పడబోతోంది. అలాగే తెల్లవారుజామన 4 గంటలకు హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఒకటి రెడు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. ఏపీలో అయితే బెనిఫిట్ షోలకు ఛాన్స్ లేనట్లే తెలుస్తోంది. అక్కడ ఐదో షో విషయంలో ఇటీవల మార్గదర్శకాలు వచ్చినా.. అందులో కొన్ని మెలికలున్నాయి. మరి మార్నింగ్ షో కంటే ముందు ఒకషో పడుతుందో లేదో క్లారిటీ లేదు.